Ukraine: యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్‌

Ukraine: సైన్యంలో సిబ్బంది కొరతతో సతమతమవుతోన్న ఉక్రెయిన్‌ అక్కడి జైలులో ఉన్న ఖైదీలను ఇంటర్వ్యూ చేస్తోంది. యుద్ధంలో చేరుతామంటే జైలు నుంచి విడుదల చేస్తామని వారికి ఆఫర్‌ ఇస్తోంది.

Published : 01 Jul 2024 13:28 IST

కీవ్‌: దాదాపు రెండున్నరేళ్లుగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌ (Ukraine).. యుద్ధ భూమిలో తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. సైన్యాన్ని పటిష్టం చేసేందుకు ముమ్మరంగా నియామకాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తొలిసారిగా జైల్లోని ఖైదీల (Prisoners)నూ మిలటరీలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేస్తోంది.

మాస్కోకు వ్యతిరేకంగా యుద్ధం (Russia Ukraine War)లో చేరుతామనే వారిపై కేసులు కొట్టేసి జైలు నుంచి విడుదల చేస్తామని ఉక్రెయిన్‌ ఆర్మీ ఖైదీలకు ఆఫర్‌ ఇచ్చింది. ‘‘ఈ నిర్బంధ జీవితానికి ముగింపు పలకండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇందుకోసం మీరు చేయాల్సింది ఒకటే..! మీ మాతృభూమిని కాపాడుకునేందుకు ఫ్రంట్‌లైన్‌లో పోరాడాలి’’ అని ఆర్మీ రిక్రూటర్లు ఖైదీల్లో ప్రేరణ నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్‌..!

ఖైదీలను విడుదల చేసి వారిని సైన్యంలో తీసుకునేందుకు ఉక్రెయిన్‌ (Ukraine) గత నెల పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ఆమోదించింది. ఇప్పటికే 3000 మంది ఖైదీలను పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద మిలిటరీ యూనిట్లలోకి తీసుకోగా.. ఇప్పుడు మరో 27 వేల మంది కోసం కొత్త రిక్రూట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. ఖైదీలకు పడిన శిక్షను సమీక్షించి.. వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించిన తర్వాతే వారిని ఇంటర్వ్యూ చేస్తోంది. అత్యాచారం, హత్య వంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని అనర్హులుగా ప్రకటించింది. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఆర్మీ క్యాంప్‌ల్లో సాధారణ శిక్షణ ఇవ్వనుంది. ఆయుధాలను ఎలా పట్టుకోవాలి.. యుద్ధ పరికరాలను ఎలా ఉపయోగించాలి అన్నది నేర్పించిన తర్వాత యుద్ధ విధుల్లోకి పంపించనుంది. ఈ ప్రోగ్రామ్‌కు ఖైదీల నుంచి మంచి స్పందన వస్తోంది.

రష్యా (Russia)తో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ సైన్యంలో ప్రాణనష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమంది సిబ్బంది మరణించారనే విషయాన్ని కీవ్‌ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఫ్రంట్‌లైన్‌ కమాండర్లు చెబుతున్నారు. కాగా.. గతంలో రష్యా కూడా తమ జైళ్లలోని ఖైదీలకు ఇలాంటి ఆఫరే ఇచ్చింది. అయితే యుద్ధంలో పోరాడతామనే వారిని అధికారిక మిలిటరీలోకి కాకుండా.. కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌లోకి తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని