UK General Election: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలు.. ‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను!

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. అక్కడి హిందూ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.

Published : 30 Jun 2024 17:53 IST

లండన్‌: బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. పోలింగ్‌కు ముందు చివరి వీకెండ్‌ కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు విస్తృత ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో అక్కడ హిందూ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి, కన్జర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌, లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌లు అక్కడ హిందూ దేవాలయాలను సందర్శించి, తమ విధానాలతో ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లండన్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ్‌ ఆలయాన్ని సందర్శించిన సునాక్‌ దంపతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునాక్‌ మాట్లాడుతూ.. టీ20లో వరల్డ్‌ కప్‌లో భారత్‌ విజయం మొదలు హిందూ మతంపై విశ్వాసం వరకు అనేక విషయాలను ప్రస్తావించారు. తానూ హిందువునేనని, ఆ మతం నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని అన్నారు. బ్రిటన్‌ పార్లమెంటు సభ్యుడిగా భగవద్గీతపై ప్రమాణం చేయడం ఎంతో గర్వంగా భావిస్తానన్నారు. అంతేకాకుండా హిందువులు గర్వించేలా విధానాలను కొనసాగిస్తానని ప్రవాస భారతీయులకు హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

చనిపోయాక ‘గేట్స్‌’కు విరాళాలు ఉండవు - వారెన్‌ బఫెట్‌

మరోవైపు లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ కూడా కింగ్స్‌బరీలో ఉన్న మరో స్వామినారాయణ్‌ ఆలయాన్ని సందర్శించారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూనే హిందూ ఆలయాల రక్షణ, ఈ వర్గంపై దాడులను దీటుగా ఎదుర్కొనే చర్యలు తమ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు.

2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో దాదాపు 10లక్షల మంది హిందువులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఓటర్ల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. దీంతో ఈ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు ‘హిందూ మేనిఫెస్టో’ పేరుతో ప్రధాన పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు తాజా ఎన్నికల్లో రిషి సునాక్‌ కాస్త వెనకబడినట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులు ఎటువైపు మొగ్గుచూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని