Mosquitoes: హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!

కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు.

Updated : 21 Jun 2024 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరించిపోతున్న జీవజాతులను పరిరక్షించుకునేందుకు ఆయా దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న హవాయి రాష్ట్రం వినూత్న చర్యలు చేపట్టింది. తమ ప్రాంతంలో కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతోంది. హెలికాప్టర్ల సాయంతో ఇప్పటికే కోటి దోమలను వదిలినట్లు అంచనా.

50 పక్షిజాతులకు ముప్పు..

అందమైన హవాయి దీవుల్లో ఇటీవల 33 రకాల పక్షులు అంతరించిపోయినట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాలు ముప్పును ఎదుర్కొంటుండగా.. వీటిలో కొన్ని మరో ఏడాదిలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ‘అకికికి’ అనే పక్షుల సంఖ్య 2018లో 450 ఉన్నట్లు అంచనా వేయగా.. 2023 నాటికి వాటి సంఖ్య ఐదుకు పడిపోయింది. ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలి ఉండొచ్చని అంచనా.

ఈ పరిణామంపై పర్యావరణవేత్తల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోన్న వేళ అక్కడి ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇందు కోసం భారీ స్థాయిలో దోమలను హెలికాప్టర్ల సాయంతో విడుదల చేస్తోంది. ఇలా ప్రతివారం ఓ హెలికాప్టర్‌ ద్వారా రెండున్నర లక్షల మగ దోమలను తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు కోటి దోమలను వివిధ ప్రదేశాల్లో విడిచిపెట్టినట్లు సమాచారం.

వినూత్న విధానం..

హవాయిలో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షిజాతులు (హనీక్రీపర్స్‌) మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధి కారక దోమ కుడితే 90 శాతం చనిపోయే ప్రమాదం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వీటికి లేకపోవడమే కారణం. దీనికి పరిష్కారంగా వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగ దోమలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని కలిసిన ఆడ దోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా దోమల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని ఇన్‌కంపాటబుల్‌ ఇన్‌సెక్ట్‌ టెక్నిక్‌గా వ్యవహరిస్తారు.

యూఎస్‌ నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. చైనా, మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు ఇదే విధానాన్ని అనుసరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని