Rishi Sunak: మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం

Rishi Sunak: దేశ ప్రజలు మార్పు కోరుకున్నారని, వారి తీర్పును తాను గౌరవిస్తానని రిషి సునాక్‌ అన్నారు. బ్రిటన్‌ ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు.

Published : 05 Jul 2024 17:35 IST

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో (UK Parliament Elections) రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహించిన సునాక్‌ (Rishi Sunak) పదవి నుంచి దిగిపోయారు. అంతకుముందు తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ ముందు నిలబడి ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

‘‘ముందుగా మీ అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నా. ప్రధానిగా నా బాధ్యతలను ఏ లోటు లేకుండా నిర్వర్తించానని భావిస్తున్నా. కానీ, యూకేలో ప్రభుత్వం కచ్చితంగా మారాల్సిందేనని మీరు (ప్రజలు) స్పష్టమైన సందేశమిచ్చారు. మీ తీర్పే అంతిమం. మీ ఆగ్రహాన్ని, అసంతృప్తిని నేను విన్నాను. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే’’ అంటూ తన భార్య అక్షతామూర్తిని చూసుకుంటూ సునాక్‌ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

రిషి సునాక్‌కు షాకిచ్చిన బారిస్టర్‌.. ఎవరీ కీర్‌ స్టార్మర్‌..?

అటు కన్జర్వేటివ్‌ పార్టీ (Conservative Party) నేతలకు కూడా సునాక్‌ క్షమాపణలు చెప్పారు. ‘‘మా పార్టీలో చాలా మంది నా సహ ఎంపీలు ఈసారి సభ్యత్వం కోల్పోయారు. ఇది నన్ను చాలా బాధించింది. ఇందుకు బాధ్యత వహిస్తూ పార్టీ అధినాయకత్వ పదవికీ రాజీనామా చేస్తా. అయితే వెంటనే కాదు.. కొత్త నేతను ఎన్నుకునే అధికారిక ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ బాధ్యతల నుంచి వైదులుగుతా’’ అని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు సునాక్‌ (Rishi Sunak) అభినందనలు తెలిపారు. ఆయన మంచి వ్యక్తి అని ప్రశంసించారు.

‘‘ఎన్నో గడ్డు పరిస్థితుల తర్వాత ఇది చాలా కష్టమైన రోజు. ఈ దేశ ప్రధానిగా సేవ చేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం మనది. బ్రిటిష్‌ ప్రజలందరికీ ధన్యవాదాలు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం తన భార్యతో కలిసి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు వెళ్లారు. ప్రధానిగా తన రాజీనామా పత్రాన్ని బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ 3కి అందించారు. సునాక్‌ రాజీనామాను రాజు ఆమోదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని