స్పెయిన్‌ విమానంలో కుదుపులు.. ఆగమాగమైన ప్రయాణికులు

గగనతలంలో వెళుతున్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి అమాంతం ఎగిరిపడ్డారు.

Published : 03 Jul 2024 05:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గగనతలంలో వెళుతున్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి అమాంతం ఎగిరిపడ్డారు. ఒక వ్యక్తి ఏకంగా ఓవర్‌హెడ్‌ బిన్‌ వద్ద ఇరుక్కుపోయాడు. మిగతా ప్రయాణికులు అతణ్ని కిందికి దించుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. సోమవారం జరిగిన ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘ఎయిర్‌ యురోపా’ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్‌ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్‌ నుంచి ఉరుగ్వేకు బయల్దేరింది. మధ్యలో ఒక్కసారిగా కుదుపులకు గురై ప్రయాణికులు ఎగిరిపడటమే కాకుండా సీలింగ్‌ ప్యానెల్, సీట్లు దెబ్బతిన్నాయి. చిన్నారులు భయంతో ఏడుపు లంకించుకున్నారు. అనూహ్యమైన ఈ ఘటనతో విమానాన్ని అత్యవసరంగా బ్రెజిల్‌లోని నాటల్‌ ఎయిర్‌పోర్టులో దింపారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఐరోపా టూర్‌ ముగించుకొని స్వదేశానికి తిరిగి వెళుతున్న ఓ ప్రయాణికుడు ఈ ఘటనపై మాట్లాడుతూ.. ‘‘మార్గమధ్యంలో ఉండగా కుదుపుల గురించి కెప్టెన్‌ హెచ్చరించారు. సీట్‌బెల్టు సరిగా పెట్టుకోనివారు గాల్లోకి ఎగిరిపడ్డారు. అది భయానక అనుభవం’’ అన్నారు. ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని