నాలుగేళ్ల తర్వాత భారత్‌కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి

ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్‌కు బయలుదేరిన ఆమె హఠాత్తుగా విమానంలోనే ప్రాణాలు విడిచింది.

Updated : 02 Jul 2024 05:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్‌కు బయలుదేరిన ఆమె హఠాత్తుగా విమానంలోనే ప్రాణాలు విడిచింది. ఈ హృదయవిదారక ఘటన క్వాంటాస్‌ విమానంలో చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భారత్‌కు చెందిన మన్‌ప్రీత్‌ కౌర్‌ (24) 2020లో ఆస్ట్రేలియా వెళ్లారు. నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు ఎంతో ఎదురు చూశారు. అంతే ఉత్సాహంతో జూన్‌ 20న మెల్‌బోర్న్‌ నుంచి దిల్లీ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో విమానం టేకాఫ్‌ కాబోతుండడంతో సిబ్బంది సీటు బెల్టు ధరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఆమె బెల్టు పెట్టుకునేందుకు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అంతలోనే తీవ్ర అస్వస్థతకు గురైన కౌర్‌ సీటు నుంచి కింద పడిపోయారు. గమనించిన సిబ్బంది బాధితురాలికి తక్షణ వైద్య సహాయం అందించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కౌర్‌ కొంతకాలంగా క్షయవ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె స్నేహితుడు మీడియాకు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని