పుడమికి చేరువగా వచ్చి వెళ్లిన గ్రహశకలాలు

రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Published : 01 Jul 2024 06:28 IST

దిల్లీ: రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇందులో ఒకటి శని, ఆదివారాల్లో పుడమి సమీపానికి వచ్చింది. దాని పేరు 2024 ఎంకే. వెడల్పు 200 మీటర్లు. ఆదివారం అంతర్జాతీయ గ్రహశకల దినం. సరిగ్గా అదే రోజున ఈ పరిణామం జరగడం విశేషం. మనకు అత్యంత చేరువగా వచ్చినప్పుడు ఈ గ్రహశకలం.. 3లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో ఇది 77 శాతంతో సమానం. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ పరిమాణం చోటుచేసుకుంది. ఈ గ్రహశకలాన్ని ఒకమోస్తరు స్థాయి బైనాక్యులర్‌తో ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో ఔత్సాహికులు వీక్షించారు. ఈ అంతరిక్ష శిల పెద్దది కావడం, చాలా దగ్గరగా రావడం వంటి కారణాల వల్ల అది ఒకింత ప్రకాశవంతంగా కనిపించింది. దీన్ని తొలిసారిగా ఈ ఏడాది జూన్‌ 16న గుర్తించారు.రెండో గ్రహశకలం పేరు 2011 యూఎల్‌21. దీని వెడల్పు 2.3 కిలోమీటర్లు. భూమికి సమీపంలోని 99 శాతం ఖగోళవస్తువుల కన్నా ఇది పెద్దది. కొద్దిరోజుల కిందట అది పుడమికి చేరువగా వచ్చి వెళ్లింది. అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు అది మనకు 66 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. 1900 తర్వాత పుడమి సమీపానికి వచ్చి వెళ్లిన పది అతిపెద్ద గ్రహశకలాల్లో ఇది కూడా ఒకటి. భూమికి చుట్టుపక్కల 20 మీటర్ల కన్నా పెద్దగా ఉన్న శిలలు 50 లక్షల వరకూ ఉన్నాయి. అవి పుడమి మీదకు దూసుకొస్తే నష్టం తప్పదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని