ఐఎస్‌ఎస్‌లో కొద్దిసేపు ఎమర్జెన్సీ

భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌లు తప్పనిసరిగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది.

Published : 29 Jun 2024 05:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌లు తప్పనిసరిగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఐఎస్‌ఎస్‌కు అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బుధవారం ఐఎస్‌ఎస్‌కు దగ్గరగా ఓ ఉపగ్రహం ముక్కలై శకలాలను విడుదల చేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని వ్యోమగాములకు చేరవేసింది. దీంతో నిర్దేశిత ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వారికి సంబంధించిన వ్యోమనౌకల్లోకి  వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్‌ 5 నుంచి అక్కడ ఉంటున్న సునీత, విల్‌మోర్‌లు స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో తలదాచుకొన్నారు. దాదాపు గంటసేపు మిషన్‌ కంట్రోల్‌ అధికారులు ఇక్కడి వ్యర్థాలు ప్రయాణించే మార్గాన్ని సునిశితంగా పరిశీలించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి తర్వాత ముప్పులేదని నిర్ధారించుకొని వ్యోమగాములకు క్లియరెన్స్‌ ఇచ్చారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌లు మరికొద్ది కాలం అక్కడే ఉంటారని నాసా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని