భూమికి చేరిన జాబిల్లి ఆవలిభాగం నమూనాలు

చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జాబిల్లి ఆవలివైపు నమూనాలను సేకరించి, వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది.

Published : 26 Jun 2024 05:54 IST

ప్రపంచంలోనే తొలిసారిగా సాధించిన చైనా 

ఇన్నర్‌ మంగోలియా ప్రాంతంలో దిగిన రిటర్న్‌ క్యాప్సూల్‌ 

బీజింగ్‌: చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జాబిల్లి ఆవలివైపు నమూనాలను సేకరించి, వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండోవైపు నుంచి మట్టితో చాంగే-6 వ్యోమనౌక మంగళవారం పుడమిని చేరుకుంది. ఈ యాత్రను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అభినందించారు. 

మే 3న నింగికెగిరిన చాంగే-6.. జూన్‌ 2న జాబిల్లి ఆవలివైపున సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌లో సురక్షితంగా దిగింది. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్‌ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి ఉపరితలానికి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది. ఈ నెల 4న.. నమూనాలతో చంద్రుడి ఉపరితలం నుంచి బయలుదేరి, చందమామ కక్ష్యలోకి చేరింది. అనంతరం భూమి దిశగా పయనాన్ని ఆరంభించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటలకు చాంగే-6లోని రిటర్నర్‌ క్యాప్సూల్‌.. పారాచూట్ల సాయంతో ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగోలియన్‌ ప్రాంతంలో సురక్షితంగా దిగింది. ఇందులో 2 కిలోల మేర జాబిల్లి నమూనాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్యాప్సూల్‌ను వాయు మార్గంలో బీజింగ్‌ తరలించి, అక్కడ తెరుస్తారు. చందమామ నమూనాలను శాస్త్రవేత్తల బృందానికి అప్పగిస్తారు. చంద్రుడి ఆవిర్భావం గురించి ఇది మరిన్ని కొత్త వివరాలను వెలుగులోకి తెస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జాబిల్లి రెండు పార్శ్వాలకు మధ్య ఉన్న వైరుధ్యాల గురించి కూడా తెలుస్తుందని వివరించారు. 


సంక్లిష్ట యాత్ర

చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. దాన్ని ఇవతలి భాగం (నియర్‌ సైడ్‌)గా పేర్కొంటారు. కనిపించని ఆ రెండో పార్శ్యాన్ని ఆవలి భాగం (ఫార్‌ సైడ్‌)గా పిలుస్తారు. ఇప్పటివరకు అమెరికా, సోవియెట్‌ యూనియన్‌తో పాటు చైనా కూడా పలుమార్లు ఇవతలి వైపు నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చింది. అవతలి భాగం నుంచి మట్టి, శిలలను తీసుకురావడం ఇదే తొలిసారి. దూరం, అక్కడి భారీ బిలాలు వంటి కారణాలరీత్యా చంద్రుడిలోని ఆ పార్శ్వం వద్దకు యాత్రల నిర్వహణ చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. చందమామ అవతలి భాగంలో ఇప్పటివరకూ వ్యోమనౌకను విజయవంతంగా దించిన ఘనత చైనాకు మాత్రమే ఉంది. ఇప్పటికి రెండుసార్లు అక్కడ ల్యాండింగ్‌ నిర్వహించింది. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్‌ సెన్సింగ్‌ పరిశీలనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉంటుంది. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని