తిరుగు ప్రయాణంలోనూ సునీతా విలియమ్స్‌కు తిప్పలు

సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదాపడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి అడుగుపెట్టిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడంలేదు.

Published : 23 Jun 2024 05:17 IST

ఇంకా ఐఎస్‌ఎస్‌లోనే భారత సంతతి వ్యోమగామి!

వాషింగ్టన్‌: సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదాపడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి అడుగుపెట్టిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడంలేదు. దీంతో ల్యాండింగ్‌ వాయిదా పడింది. సునీతతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ఈ నెల 5న ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 14న వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సింది. అయితే స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భూమిపై ల్యాండింగ్‌ను వాయిదా వేశారు. జూన్‌ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీని ఇంకా వెల్లడించలేదు. అన్నీ అనుకూలిస్తే జులై 2న వీరి తిరుగుప్రయాణం ఉండొచ్చని అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా అంచనా వేస్తోంది. స్టార్‌లైనర్‌ వ్యోమనౌకకు ఇదే తొలి మానవసహిత యాత్ర. భూమి నుంచి బయలుదేరే సమయంలోనూ దీనికి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్‌-కంట్రోల్‌ థ్రస్టర్లలో ఇబ్బందులు ఎదురై సునీత, విల్‌మోర్‌ల అంతరిక్షయానం పలుమార్లు వాయిదా పడింది. రోదసిలోకి వెళ్లిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఐఎస్‌ఎస్‌తో ఈ వ్యోమనౌక అనుసంధానం కాగలిగింది. సునీతకు ఇది మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని