Dharani: ధరణి లాగిన్‌.. డిప్యూటీ తహసీల్దార్లకు!

జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Published : 01 Jul 2024 07:58 IST

తహసీల్దార్లకు భూ సమస్యల పరిష్కారం, ఇతర బాధ్యతలు
సేవల్లో వేగం పెంచేందుకు కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లతోపాటు భూ సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు- సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. అయితే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల సేవలతోనే వారి సమయం గడిచిపోతోంది. భూ సమస్యలు ఇతర ప్రొటోకాల్‌ సేవల పరిశీలన పనులు భారంగా మారుతున్నాయి. భూ సమస్యల పరిష్కారంలో వేగం తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించి, కార్యాలయ నిర్వహణ, సమస్యల పరిష్కారం ఇతర అధికారిక విధులు, కార్యాలయ పర్యవేక్షణ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది అమలైతే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్‌ను డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 

మొదట పైలట్‌ ప్రాజెక్టు 

2020 నవంబరు నుంచి తహసీల్దారు కార్యాలయాలు వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం ప్రారంభించింది. ధరణి ఆపరేటర్‌ మినహా కొత్త సిబ్బందిని ఎవరినీ కేటాయించలేదు. పైగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటుతో ఉన్నవారినే పంచారు. దీంతో తీవ్రమైన సిబ్బంది కొరత ఏర్పడింది. భూ సేవలే కాకుండా ధ్రువీకరణ పత్రాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, విచారణలు, పంచనామాలు, ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక వంటి 36 రకాల సేవలను తహసీల్దారు కార్యాలయమే నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రెవెన్యూశాఖ కీలక సంస్కరణలను తీసుకురావాలని భావిస్తోంది. ధరణి పోర్టల్‌ లాగిన్లను తహసీల్దార్లతోపాటు డిప్యూటీ తహసీల్దార్లకు పూర్తిస్థాయిలో ఇచ్చేముందు కొన్ని జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద నడిపించి పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని