TG DGP: తెలంగాణ డీజీపీగా జితేందర్‌!

తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated : 10 Jul 2024 10:42 IST

సీఎం రేవంత్‌ నిర్ణయం.. నేడు ఉత్తర్వుల జారీ
కొందరు ఐపీఎస్‌లూ బదిలీ అయ్యే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా.. సీఎం మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్‌ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

నిర్మల్‌ ఏఎస్పీ నుంచి డీజీపీ దాకా.. 

పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్‌ 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్‌ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత దిల్లీ సీబీఐలో.., 2004-06 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగే అవకాశముంది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎన్నికల కమిషన్‌ నియమించింది. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్‌ చేసిన తర్వాత రవిగుప్తాను ఎంపిక చేసింది. అప్పటినుంచి ఆయనే డీజీపీగా ఉన్నారు. తాజాగా జితేందర్‌ వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 

రాజధానిలో ఒక కమిషనర్‌కు స్థానచలనం! 

కొత్త డీజీపీ నియామకంతో పాటు మరికొందరు ఐపీఎస్‌ అధికారులకు స్థానచలనం ఉండవచ్చని తెలుస్తోంది. రాజధాని కమిషనరేట్లకు సంబంధించి ఒక కమిషనర్‌ను మార్చే అవకాశముంది. గతంలో అదే కమిషనరేట్‌ యూనిట్‌ అధికారిగా పనిచేసిన ఐపీఎస్‌ను అక్కడ తిరిగి నియమించనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి మారనున్న ఐపీఎస్‌కు మల్టీజోన్‌ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. అలాగే మరో మల్టీజోన్‌కు హైదరాబాద్‌లోనే పనిచేస్తున్న ఓ ఐజీని నియమించి.. ఇటీవల మారిన మరో ఐపీఎస్‌ను అక్కడ భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని