Real estate: జీహెచ్‌ఎంసీ పరిధిలో రియల్‌ జిగేల్‌

‘గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది.   భవనాలు, లేఅవుట్ల అనుమతులతోపాటు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనం.

Published : 10 Jul 2024 06:13 IST

రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా వృద్ధి
గత ఏడు నెలల్లో రూ.4,670 కోట్ల రాబడి
పుంజుకున్న భవన నిర్మాణ రంగం
నివేదిక విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

‘గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది.   భవనాలు, లేఅవుట్ల అనుమతులతోపాటు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది’ అని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల సంఖ్య కూడా పెరిగినట్లు పేర్కొంది. ఎన్నికల కోడ్‌తో దాదాపు 3 నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే స్థిరాస్తి రంగం గణనీయంగా పుంజుకున్నట్లు స్పష్టం చేసింది. 


నివేదికలోని ముఖ్యాంశాలు

  • కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి.. అంటే 2023 డిసెంబరు నుంచి జూన్‌ నెలాఖరు వరకు 7 నెలల్లో ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4670.52 కోట్ల ఆదాయం వచ్చింది. 
  • అంతకు ముందు 7 నెలల్లో అంటే.. మే 2023 నుంచి నవంబరు వరకు వచ్చిన ఆదాయం రూ.4429.23 కోట్లు. అంటే రూ.241.29 కోట్ల ఆదాయం వృద్ధి చెందింది. గత సంవత్సరం(2022 డిసెంబరు నుంచి 2023 జూన్‌ వరకు) ఇదే వ్యవధితో పోల్చినా రూ.270.86 కోట్లు ఎక్కువ. 
  • గత 7 నెలల్లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,18,160. గత ఏడాది ఇదే వ్యవధిలో 1,93,962 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే 12% పెరిగాయి. 
  • ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 54,111 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరిగింది. గత ఏడాది ఇదే వ్యవధిలో 50,535 అయ్యాయి. అప్పటితో పోలిస్తే 7% పెరుగుదల నమోదైంది. 
  • గతేడాది డిసెంబరు 7 నుంచి జూన్‌ 30 వరకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో అనుమతి ఇచ్చిన భవనాల దరఖాస్తుల సంఖ్య 18,077. గత ఏడాది మే నుంచి డిసెంబరు 6 వరకు ఇచ్చినవి 17,911. 
  • గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 7 నెలల్లో ఆమోదించిన భవన నిర్మాణ అనుమతులు 7,809. అంతకు ముందు 7 నెలలతో పోలిస్తే 13.17 శాతం పెరిగాయి. 
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్‌ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో సిటీ రూపురేఖలు మరింతగా మారిపోనున్నాయి. 
  • మరోవైపు రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించటంతో స్థిరాస్తి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని నివేదిక పేర్కొంది.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని