Kazipet: చుక్‌ చుక్‌ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!

నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్‌ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్‌ లైన్లు, రైల్‌ ఓవర్‌ రైల్‌(ఆర్‌ఓఆర్‌) వంతెనలు నిర్మిస్తోంది.

Updated : 01 Jul 2024 07:36 IST

340 మీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం
భూఉపరితలంపై ఓ రైలు.. లోపల మరోటి
కాజీపేట రైల్వే స్టేషన్‌ సమీపంలో నిర్మాణం

ఈనాడు, హైదరాబాద్‌: నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్‌ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్‌ లైన్లు, రైల్‌ ఓవర్‌ రైల్‌(ఆర్‌ఓఆర్‌) వంతెనలు నిర్మిస్తోంది. అయితే, ఈ ప్రక్రియలో భూసేకరణ సమస్యలు వస్తున్నాయి. కొన్నిచోట్ల సేకరిద్దామన్నా భూమి అందుబాటులో ఉండదు. చుట్టూ నివాస, ఇతర భవనాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నచోట రైల్వేశాఖ వినూత్నంగా రైల్‌ అండర్‌ రైల్‌(ఆర్‌యూఆర్‌) వంతెనలు నిర్మిస్తోంది. అంటే నేలపై నుంచి ఒక రైలు వెళ్తే.. ఆ రైలు కింది నుంచి మరో రైలు ప్రయాణం చేస్తుంది. నేలపైన ఉన్న పట్టాల కింద అంటే.. భూగర్భంలో మరో రైలు మార్గాన్ని నూతనంగా నిర్మించడం అన్నమాట. రాష్ట్రంలోని కోమటిపల్లి-కాజీపేట సెక్షన్‌లో నిర్మిస్తున్న ఆర్‌యూఆర్‌.. జోన్‌ పరిధిలోనే మొదటిదని ద.మ. రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ‘ఈనాడు’కు తెలిపారు.


11చోట్ల రైల్‌ ఓవర్‌ రైల్‌ వంతెనలు

జోన్‌ పరిధిలో 11 చోట్ల రైల్‌ ఓవర్‌ రైలు వంతెనలున్నాయి. అంటే కింది నుంచి ఒక రైలు వెళ్తోంటే.. పైనుంచి మరోటి వెళ్తుంది. ఇలాంటి వంతెనలు విజయవాడ సమీపంలో రెండు.. వెంకటాచలం, గూడూరు, అకోలా సమీపంలో ఒక్కోటి.. అమ్ముగూడ, లాలాగూడ, మేడ్చల్‌ సమీపంలో రెండేసి ఉన్నాయి.


రూ.125 కోట్లతో 21.47 కి.మీ. బైపాస్‌

నిర్మాణంలో ఉన్న భూగర్భ రైలు మార్గం

దేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో కాజీపేట ప్రాంతం కీలకమైంది. దిల్లీ వైపు నుంచి వచ్చే రైలు మార్గం వడ్డేపల్లి చెరువు దగ్గరకు రాగానే- ‘వై’ ఆకారంలో రెండుగా చీలిపోతుంది. ఒకవైపు వెళ్తే కాజీపేట మార్గం. ఇది కి.మీ. దూరం. మరోవైపు వెళ్తే వరంగల్‌ స్టేషన్‌. ఇది 10 కి.మీ. దూరం. దిల్లీ-సికింద్రాబాద్‌ రైళ్లు కాజీపేట మీదుగా.. దిల్లీ-విజయవాడ మార్గంలోని రైళ్లు వరంగల్‌ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మూడు వైపులా రైళ్ల రాకపోకలతో వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా వరంగల్‌ వైపు గూడ్సు రైళ్లు వెళ్లేంతవరకు.. దిల్లీ, బల్లార్షాల వైపు నుంచి కాజీపేట, సికింద్రాబాద్‌ వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వడ్డేపల్లి చెరువు ప్రాంతం(కాజీపేట స్టేషన్‌ ఔటర్‌)లో నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణం ఆలస్యం అవుతోంది. ఈ సమస్యను నివారించి బల్లార్షా-సికింద్రాబాద్, విజయవాడ-బల్లార్షా, సికింద్రాబాద్‌-విజయవాడ... ఇలా అన్ని మార్గాల్లో రైళ్లు సాఫీగా రాకపోకలు సాగించేందుకు కోమటిపల్లి-వరంగల్‌ మధ్య బైపాస్‌ లైన్‌ను ద.మ. రైల్వే నిర్మిస్తోంది. ఇక్కడ రూ.125 కోట్ల వ్యయంతో 21.47 కి.మీ. మేర భూగర్భ మార్గం నిర్మిస్తున్నారు. ఈ పనుల్ని జోన్‌ జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ఇటీవల పరిశీలించారు.


3, 4 నెలల్లో సొరంగ మార్గం పూర్తి!

కాజీపేట సమీపంలో ఇప్పుడున్న రైలు పట్టాల పక్కన భూగర్భంలోకి వెళ్లే ట్రాక్‌ నిర్మిస్తున్నది ఇక్కడే..

బైపాస్‌ లైన్‌లో 3 పెద్ద, 31 చిన్న వంతెనలు రానున్నాయి. బైపాస్‌ కోసం 7.8 హెక్టార్ల భూమి సేకరించారు. అయితే ఒకచోట భవనాల కారణంగా భూసేరణ సాధ్యం కాలేదని.. అందుకే ఆ ప్రాంతం వరకు భూ ఉపరితలంపై ప్రస్తుతం ఉన్న రైలు మార్గం కింద మరో రైలు మార్గం నిర్మిస్తున్నట్లు ద.మ. రైల్వే వర్గాలు తెలిపాయి. కోమటిపల్లి నుంచి వడ్డేపల్లి చెరువు వరకు భూగర్భంలో 340 మీటర్ల మేర సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3, 4 నెలల్లో భూగర్భ మార్గం పూర్తయ్యే అవకాశం ఉంది. కోమటిపల్లి దగ్గర భూఊపరితలం నుంచి రైలు మెల్లమెల్లగా కిందికి దిగుతుంది. అండర్‌గ్రౌండ్‌లో 340 మీటర్లు ప్రయాణం చేసి.. ఆ తర్వాత మెల్లమెల్లగా పైకి వెళ్తూ వడ్డేపల్లి చెరువు దగ్గర భూ ఉపరితల స్థితికి చేరుకుంటుంది. ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌తో నడిచేందుకు వీలుగా భూగర్భంలో విద్యుదీకరణ కూడా చేయనున్నారు. అండర్‌గ్రౌండ్‌ మార్గం మినహా మిగతా బైపాస్‌ లైన్‌ పనులు సాగుతున్నాయి. వీటికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. బైపాస్‌ పూర్తయితే హసన్‌పర్తి రోడ్‌ నుంచి అటు వరంగల్‌ వైపు, ఇటు కాజీపేట వైపు రైళ్లను ఒకేసారి పంపించొచ్చు. బల్లార్షా నుంచి కాజీపేట, వరంగల్‌ వైపు వచ్చే రైళ్లకు క్రాసింగ్‌ సమస్యలు తీరిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని