phone tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ కుట్రలో నవీన్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్‌రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Updated : 04 Jul 2024 06:34 IST

ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఫోన్‌పైనా అప్పట్లో నిఘా
అట్లాస్‌ టూల్‌ నుంచి సోషల్‌ మీడియా ప్రొఫైళ్ల సేకరణ
హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో దర్యాప్తు అధికారుల వెల్లడి
ప్రభాకర్‌రావు, శ్రవణ్‌ల పాస్‌పోర్టుల జప్తునకు ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్‌రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావుతోపాటు నవీన్‌రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. రాజకీయ నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ ఉన్నతాధికారుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డితోపాటు ఐఏఎస్‌ అధికారులు రొనాల్డ్‌రాస్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది. హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఈ కేసులో దర్యాప్తు అధికారులు బుధవారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాలను వెల్లడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావే మాస్టర్‌ మైండ్‌ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉందని, అందుకు విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను విచారించడం కీలకమని న్యాయస్థానానికి విన్నవించారు. ఇంటర్‌పోల్‌ బ్లూ నోటీస్‌ ద్వారా వారిద్దరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులను జప్తు చేయాలని రీజినల్‌ పాస్‌పోర్టు అథారిటీకి దర్యాప్తు అధికారి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిన డేటాతోపాటు ఎస్‌ఐబీకి సంబంధించిన 62 హార్డ్‌ డిస్క్‌లను నిందితులు ధ్వంసం చేసి.. కీలక సమాచారాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. ఎస్‌ఐబీలోని క్యాట్, యూఎఫ్‌ టీమ్‌ల సమాచారాన్నీ తొలగించారని తెలిపారు. కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ ప్రతినిధులు గతంలో సమకూర్చిన 3 సర్వర్లను, 5 యాపిల్‌ హార్డ్‌డిస్క్‌లను ఆ సంస్థ ప్రతినిధులే వచ్చి తొలగించారన్నారు. మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం కలిగించారని ఆరోపించారు. అఫిడవిట్‌లో దర్యాప్తు అధికారులు పేర్కొన్న వివరాలు.. 

కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్‌రావుల ఆదేశాలతో శ్రీధర్‌రావుపై క్రిమినల్‌ కేసులు

కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్‌రావు తదితర భారాస నేతల ఆదేశాల మేరకు సైబరాబాద్‌ పోలీసులపై ప్రభాకర్‌రావు ఒత్తిడి తెచ్చి సారనాల శ్రీధర్‌రావుపై క్రిమినల్‌ కేసులు పెట్టించారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సంభాషణలనూ ప్రణీత్‌ బృందం ఇంటర్‌సెప్ట్‌ చేసింది. ఈ ప్రక్రియను ఆర్‌ఆర్‌(రేవంత్‌రెడ్డి) మాడ్యూల్‌గా వ్యవహరించింది. రాజకీయ నేతల ప్రొఫైళ్లను తయారు చేయడంతోపాటు వారి సీడీఆర్‌ల సమాచారాన్ని ప్రణీత్‌రావు తన వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లో భద్రపరిచారు. ఆ సమాచారంతో కూడిన హార్డ్‌ డిస్క్‌ను తన బావమరిది దిలీప్‌ సహకారంతో రీప్లేస్‌ చేశారు. అనంతరం తొలగించిన హార్డ్‌ డిస్క్‌ను బేగంపేట నాలాలోకి విసిరేశారు. సెల్‌ఫోన్లను ఫార్మాట్‌ చేసుకోవాలని తన బృందం సభ్యులకు సూచించారు. 

2022 అక్టోబరులో వెలుగులోకి వచ్చిన భారాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారానే బహిర్గతమైంది. దిల్లీకి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి స్వామితో కోరె నందకుమార్‌ మాట్లాడిన ఫోన్‌ కాల్స్‌ను ప్రణీత్‌ దొంగచాటుగా విన్నారు. ఆ సమాచారాన్ని తన పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి ప్రభాకర్‌రావుకు అందించారు. అనంతరం ఆ సమాచారమే ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారమైంది. 

ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా మార్చి 22న శ్రవణ్‌రావు ఇంట్లో దర్యాప్తు అధికారులు సోదాలు చేశారు. డాక్యుమెంటరీ, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ లాంటి 42 వస్తువులను జప్తు చేశారు. మార్చి 23న ప్రభాకర్‌రావు ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ ఏ ఒక్క ఆధారమూ లభించలేదు. కావాలనే ఆధారాలు లేకుండా చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రభాకర్‌రావుకు సంబంధించిన వ్యక్తిగత భద్రత సిబ్బంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్‌ విభాగం ఉద్యోగి ఒకరు అట్లాస్‌ టూల్‌ నుంచి సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ను తీసి ప్రణీత్‌రావుకు పంపించినట్లు వెల్లడైంది.

ప్రభాకర్‌రావు నియామకంపై డీవోటీ అభ్యంతరం

ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసి.. 2020 జూన్‌ 30న పదవీ విరమణ పొందారు. అనంతరం జులై 1 నుంచి మూడేళ్ల కాలానికి ఆయన్ని చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌గా పునర్నియమించారు. జులై 10న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నం.18 జారీ చేశారు. అధికారికంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేసేందుకు ఉద్దేశించిన జీవోల్లో మార్పులు చేస్తూ.. ప్రభాకర్‌రావుకు బాధ్యతల్ని కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చారు. టెలిఫోన్లను, ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ను ఇంటర్‌సెప్ట్‌ చేసేందుకు అధీకృత సంతకందారుడిగా ప్రభాకర్‌రావును నియమించారు. గతంలో ఐజీలకు మాత్రమే ఈ అధికారం ఉండేది. ఐజీ స్థానంలో చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ హోదాలో ప్రభాకర్‌రావును నియమించడంపై జులై 20న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌(డీవోటీ) డైరెక్టర్‌ జనరల్‌(సెక్యూరిటీ) అభ్యంతరం తెలిపారు. మరుసటి రోజే డీవోటీ డీజీకి తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అప్పటి ఐజీ ప్రత్యుత్తరమిచ్చారు. ఐజీ హోదాలోనే విరమణ పొంది.. పునర్నియామకం పొందినందువల్లే ప్రభాకర్‌రావును అధీకృత సంతకందారుడిగా నియమించినట్లు వెల్లడించారు. అదే నెల 22న డీవోటీ సహా అందరు టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు అప్పటి హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ రూల్స్‌ 419ఏ కింద ప్రభాకర్‌రావును అధీకృత సంతకందారుగా నియమించినట్లు లేఖల్లో పేర్కొన్నారు.

నిందితులు ఎవరెవరి సీడీఆర్, ఐపీడీఆర్‌లను సేకరించారంటే..

అనుముల రేవంత్‌రెడ్డి, అనుముల కొండల్‌రెడ్డి, అనుముల తిరుపతిరెడ్డి, వినయ్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, ధర్మపురి అర్వింద్, శివధర్‌రెడ్డి, ఎ.ఆర్‌.శ్రీనివాస్, రాఘవేందర్‌రెడ్డి, ఎం.రమేశ్‌రెడ్డి, రొనాల్డ్‌రాస్, దివ్య (ఐఏఎస్‌ అధికారిణి), శశాంక్‌ తాతినేని, సునీల్‌రెడ్డి, చిలుక రాజేందర్‌రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్‌ చౌదరి, తీన్మార్‌ మల్లన్న, మహేశ్వర్‌రెడ్డి, ఏఎంఆర్‌ ఇన్‌ఫ్రా, వీరమల్ల సత్యం, మేఘా శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిషోర్‌ తదితరులు

ఎస్‌ఐబీ ఐజీ కార్యాలయానికి అందిన ఇంటర్‌సెప్ట్‌ సమాచారం..

2023 నవంబరు 2న కొన్ని ఫోన్‌ నంబర్లను ఇంటర్‌సెప్ట్‌ చేయాలంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు లేఖ రాసిన నిందితులు.. అందుకు సంబంధించిన అనుమతులు తీసుకున్నారు. సాధారణంగా ఏయే ఫోన్‌ నంబర్లను ఇంటర్‌సెప్ట్‌ చేశారనే సమాచారాన్ని సర్వీస్‌ ప్రొవైడర్లు తిరిగి ఎస్‌ఐబీ ఐజీపీ పంపిస్తుంటారు. ఈ క్రమంలోనే నవంబరు 2 నాటి అనుమతుల సమాచారాన్ని డిసెంబరు 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్‌ఐబీ ఐజీ కార్యాలయానికి అందింది. అప్పటికే ప్రభాకర్‌రావు బృందం ఎస్‌ఐబీని ఖాళీ చేసి వెళ్లిపోయింది. తాజాగా ఆ సమాచారాన్ని దర్యాప్తు అధికారులు సేకరించారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన ప్రముఖుల్లో కొందరు..

గాలి అనిల్‌కుమార్, సురేందర్‌రెడ్డి, కె.రఘువీర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి మేరెడ్డి, స్వప్నిక మేరెడ్డి, ఈటల రాజేందర్, ఉదయ(ఈటల కెమెరామన్‌), కాసాని జ్ఞానేశ్వర్, కొల్లె సరిత, అంజన్న(ఈటల గన్‌మన్‌), ఫసిఖాన్, కె.మహేందర్, నరేందర్‌రెడ్డి అనుమాండ్ల, మహేశ్‌కుమార్‌ గౌడ్, మానాల మోహన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని