సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం

సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు  గవర్నర్‌ కార్యాలయం ఆమోదం తెలిపింది.

Published : 02 Jul 2024 05:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు  గవర్నర్‌ కార్యాలయం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఇన్‌ఛార్జి గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌తో భేటీ అయిన నేపథ్యంలో ఈ దస్త్రానికి ఆమోదం లభించింది. 220 మంది ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉంది. 231 మంది ఖైదీలతో కూడిన జాబితాను కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలోనే గవర్నర్‌ కార్యాలయానికి పంపింది.  ఆ జాబితాలోని కొందరు ఖైదీలు ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో.. తాజాగా విడుదలయ్యే వారి సంఖ్య కొంత తగ్గనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉంది. విడుదల కానున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్‌ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌లు లాంటి చోట్ల ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను మంగళవారం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్యమిశ్రా బుధవారం మాట్లాడి.. అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. 

చివరిసారిగా 2020లో..

ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి లాంటి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. అయితే, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఇది కార్యరూపం దాల్చింది. 2016లో తొలిసారిగా ఖైదీలను విడుదల చేశారు. రెండోసారి 2020 అక్టోబరు 2న 141 మందిని విడుదల చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినా పలు కారణాలతో ఆమోదం లభించలేదు. ఈ ఏడాది జనవరిలోనే విడుదలకు జైళ్ల శాఖ జాబితా తయారు చేసినప్పటికీ తాజాగా మార్గం సుగమమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని