కార్మికుల భద్రత గాల్లో దీపమే

రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత కొరవడుతోంది.

Published : 29 Jun 2024 05:45 IST

కర్మాగారాల్లో ప్రమాదాలు నిత్యకృత్యం
యాజమాన్యాల నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత కొరవడుతోంది. సరైన రక్షణ చర్యలు లేకపోవడం, కర్మాగారాల విభాగం నిరంతర పర్యవేక్షణ లేమితో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ కార్మికులు గాయాల బారినపడటం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం సంగారెడ్డిలోని ఫార్మాపరిశ్రమ పేలుడు ఘటనలో ఆరుగురు మరణించిన ఘటన మరువక ముందే శుక్రవారం షాద్‌నగర్‌లో సౌత్‌గ్లాస్‌ సంస్థ ప్రమాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడటం పరిస్థితికి నిదర్శనం.

తనిఖీలప్పుడు సక్రమమే..తర్వాత షరా మామూలే

పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నాలుగు వేలకుపైగా కర్మాగారాలు ప్రమాదకర విభాగంలో ఉన్నాయి. అధికారులు తనిఖీలకు వెళ్లినపుడు ఆయా యాజమాన్యాలు నాణ్యమైన యంత్రాలను, నిపుణులైన కార్మికులను చూపుతూ నిరభ్యంతర ధ్రువీకరణపత్రం పొందుతున్నాయి. అటు తరువాత యంత్రాల నిర్వహణను గాలికొదిలేయడం, రెగ్యులర్‌ కార్మికులను తొలగించి..రోజువారీ కూలీలతో పనులు చేయిడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ముందస్తుగా ప్రమాదాల సంకేతాలను వారు గుర్తించలేకపోతున్నారు. యాజమాన్యాలు కార్మికులకు తగిన రక్షణ పరికరాలు అందించకపోవడం, ప్రమాదం జరిగినపుడు కార్మికులు వేగంగా బయటకు వెళ్లేందుకు సరైన మార్గాలు లేకపోవడంతో ప్రాణనష్టం పెరుగుతోంది.

నిరంతర పర్యవేక్షణ లేకనే

ప్రమాదాలు జరిగినపుడు ఆయా కర్మాగారాలు కార్మిక శాఖకు వివరాలు తెలియజేస్తాయి. కార్మిక శాఖ పరిధిలోని కర్మాగారాల విభాగం అధికారులు ఆ తరహా ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తారు. అయినప్పటికీ పరిశ్రమల యాజమాన్యాలు సదరు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. మరోవైపు యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయా? కార్మికులకు భద్రత ఉందా? లేదా అనేది గుర్తించడంలో కర్మాగారాల విభాగం విఫలమవుతుందనే ఆరోపణలున్నాయి. కర్మాగారాల విభాగంలోని ఖాళీ పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ కాలేదు. 20 మంది ఇన్‌స్పెక్టర్లు, జాయింట్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ప్రస్తుతం తనిఖీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా తనిఖీలు సక్రమంగా సాగకపోవడానికి కారణమవగా, పరిశ్రమల నిర్వాహకులకు ఇది వరంగా మారుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని