జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం

ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది.

Published : 29 Jun 2024 04:42 IST

ఆఫ్‌లైన్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్న ఎస్సీ గురుకుల సొసైటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. సొసైటీలో ఏకీకృత సిబ్బంది విధానం లేకపోవడంతో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు సిబ్బందికి సంబంధించి సీనియారిటీ జాబితాలోనూ పొరపాట్లు జరిగాయి. దీంతో సొసైటీలో జీవో నం.317 కింద ఉద్యోగుల కేటాయింపు గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి, అదనపు కార్యదర్శి హన్మంతనాయక్‌లు... గురుకుల సొసైటీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల వారితో సమావేశమయ్యారు. పదోన్నతులు, జీవో నం.317 కేటాయింపులపై ఇబ్బందులను పరిశీలించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సొసైటీలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, స్పౌజ్‌ కేసులతో కూడిన సవరణ సీనియారిటీ జాబితాను అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. మూడు రోజుల్లో జీవో నం.317 కింద సిబ్బంది కేటాయింపులు పూర్తవుతాయని పేర్కొన్నాయి. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌ యూనియన్‌ (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.బాలస్వామి, కీర్తి రవి ఒక ప్రకటనలో తెలిపారు. మల్టీ జోన్ల వారీగా పురుషులు, మహిళల సీనియారిటీ జాబితాలతో పాటు ఉమ్మడి జాబితాలను సొసైటీ ప్రకటించనుందని తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఏ అధ్యక్షుడు సీహెచ్‌ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని