DSC: డీఎస్సీ వాయిదా వేయాల్సిందే..

ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీని వాయిదా వేయాల్సిందేనంటూ ఆందోళన చేపడుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను మంగళవారం పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 10 Jul 2024 06:13 IST

ఓయూలో విద్యార్థుల ఆందోళన.. పలువురి అరెస్ట్‌ 

ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద సోమవారం అర్ధరాత్రి ఆందోళన చేస్తున్న విద్యార్థులు

ఈనాడు- హైదరాబాద్, లాలాపేట- న్యూస్‌టుడే: ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీని వాయిదా వేయాల్సిందేనంటూ ఆందోళన చేపడుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను మంగళవారం పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం పాఠశాల విద్య సంచాలకుల కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు అర్ధరాత్రి నుంచి ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద నిరసన చేపట్టి.. పోలీసులు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం వారిలో కొందరిని, ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ వద్ద ఆందోళన చేస్తున్న మరికొందరిని అరెస్టు చేశారు. 

రాత్రంతా విద్యార్థుల సమావేశం.. ఉదయాన్నే అరెస్ట్‌ 

హైదరాబాద్‌ లక్డీకాపుల్‌లోని పాఠశాల విద్యాసంచాలకుల కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో వదిలేశారు. వారు అక్కడి నుంచి నేరుగా ఓయూ ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సహచర విద్యార్థులు వారికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చారు. వీరంతా మాట్లాడుకుని.. తెల్లవారుజామున వసతిగృహాలకు వెళ్తుండగా.. పోలీసులు అక్కడికి చేరుకుని పదుల సంఖ్యలో విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ కొందరు విద్యార్థులు ఓయూలోని ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ వద్ద సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో విద్యార్థులు చేరుకుంటుండగా.. ఓయూ పోలీసులు విద్యార్థులను వెంటాడి మరీ అదుపులోకి తీసుకున్నారు. తమ సహచరులను తీసుకెళ్లిన పోలీసులు వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, ఎక్కడికి తరలించారో చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ వద్ద మంగళవారం విద్యార్థులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

సీఎం దిష్టిబొమ్మ దహనం

డీఎస్సీని మూణ్నెల్లు వాయిదా వేయాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు ఓయూ ఐకాస నాయకుడు మోతీలాల్, భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, విజయ్‌ సహా పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్‌ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు