Revanth Reddy: 25 లక్షల ఇళ్లు ఇవ్వండి

సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన  శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Published : 05 Jul 2024 06:42 IST

బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి
హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి
2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
ఈనాడు - దిల్లీ

ప్రధాని మోదీకి జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన  శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్‌ 3 గనులనూ సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనులు కీలకమైనందున అన్నింటినీ సింగరేణికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి గురువారం మధ్యాహ్నం ఇక్కడి లోక కల్యాణ్‌ మార్గ్‌లో సీఎం ప్రధానమంత్రి మోదీతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్‌ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై ప్రధానితో సీఎం చర్చించారు. అంతక్రితం హోంమంత్రి అమతిషాను కలిశారు. 

ప్రధానికి సీఎం వినతులు ఇలా...

  • 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌కు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్‌) మంజూరు చేసింది. 2014 తర్వాత అది ముందుకు సాగలేదు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలి.
  • హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో తగినంత భూమి అందుబాటులో ఉన్నందున అక్కడ ఐఐఎం ఏర్పాటుచేయాలి. అక్కడ కాకుండా మరెక్కడైనా ఏర్పాటు చేస్తామన్నా భూ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రానికి కొత్తగా 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలి.
  • రాష్ట్ర పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. కోచ్‌ తయారీ కేంద్రానికి బదులు ఇక్కడ పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్‌ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం దాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం భావ్యంకాదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేయండి.
  • హైదరాబాద్‌లో సెమీ కండక్టర్‌ ఫ్యాబ్స్‌ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నందున ఇండియా సెమీ కండక్టర్‌ మిషన్‌లో తెలంగాణను చేర్చాలి.
  • ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద తలపెట్టిన 3 కోట్ల గృహాల్లో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 
  • రాజధాని హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్‌ అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌-కరీంనగర్‌ రహదారి, హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ రహదారి (ఎన్‌హెచ్‌-44)పై ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి వీలుగా మార్గంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. అలాగే హైదరాబాద్‌ నగరంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని 2,450 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్‌ సెంటర్‌ ఇమరాత్‌కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాలను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 
  • రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయి. అందువల్ల వెంటనే ఉక్కు కర్మాగార ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి.
  • భారత్‌మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు)లో జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆ రహదారి భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. అందువల్ల ఈ రహదారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలి. హైదరాబాద్‌ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉపయోగంగా ఉండే ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు) జాతీయ రహదారిగా గుర్తించి, వెంటనే భారత్‌మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలి.
  • తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయాలి. జగిత్యాల-పెద్దపల్లి-కాటారం, డిండి-దేవరకొండ-మల్లెపల్లి-నల్గొండ, భువనగిరి-చిట్యాల, చౌటుప్పల్‌-ఆమన్‌గల్‌-షాద్‌నగర్‌-సంగారెడ్డి, మరికల్‌-నారాయణపేట-రామసముద్ర, వనపర్తి-కొత్తకోట-గద్వాల-మంత్రాలయం, మన్నెగూడ-వికారాబాద్‌-తాండూరు-జహీరాబాద్‌-బీదర్, కరీంనగర్‌-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, ఎర్రవల్లి ఎక్స్‌ రోడ్‌-గద్వాల-రాయచూర్, కొత్తపల్లి-హుస్నాబాద్‌-జనగామ-హైదరాబాద్, సారపాక-ఏటూరునాగారం, దుద్దెడ-కొమురవెల్లి-యాదగిరిగుట్ట-రాయగిరి క్రాస్‌ రోడ్, జగ్గయ్యపేట-వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్‌ గ్రేడ్‌ చేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని