CM Revanth Reddy: వినూత్న ఆలోచనలతో ముందుకు రండి

వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు.

Published : 03 Jul 2024 05:34 IST

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం 
త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తాననిస్పష్టీకరణ

సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి

ఈనాడు, హైదరాబాద్‌: వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో వినూత్న ఆలోచనను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతోపాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. స్థానిక ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని అధికారులను అప్రమత్తం చేశారు. తాను వారానికో జిల్లాలో పర్యటిస్తానని, త్వరలోనే జిల్లా పర్యటనల షెడ్యూలు విడుదల చేస్తామని స్పష్టంచేశారు. సచివాలయంలో మంగళవారం అన్ని విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ ఎ.శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్‌ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమ శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యానికి అనుగుణంగా పనిచేయాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఉన్నతాధికారులంతా విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాపాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడారంటే..

ప్రభుత్వ ప్రాధాన్యానికి తగ్గట్లుగా.. 

‘‘ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవమున్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాన్ని గుర్తించి అధికారులు తమ పనితీరును చాటుకోవాలి. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అధికారులందరూ ఏకతాటిపై పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ తమ విభాగాలపై పట్టు సాధించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేసింది. తర్వాత 100 రోజులు ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయి. ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలి. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. మీ శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బంది ప్రక్షాళన చేపట్టాలి. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవోతో పంచుకోవాలి. 

క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి

ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు అధికారులు క్రమశిక్షణ, సమయపాలనను పాటించాలి. కార్యాలయాలకే పరిమితం కాకుండా.. తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు విధిగా జిల్లాల్లో క్షేత్ర పర్యటనలు చేపట్టాలి. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. సంబంధిత విభాగం చేపట్టిన కార్యక్రమాలు, జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలి. చాలా జిల్లాల్లో కలెక్టర్లు తమ కార్యాలయాలు దాటడం లేదు. ఐఏఎస్‌ అధికారులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. మీ అనుభవంతో సుపరిపాలన విధానాలు అమలుచేయాలి. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా సీఎస్‌ చొరవ చూపాలి. ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడూ సందర్శించాలి. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలన్నింటిలోనూ అధికారులు సత్వరమే స్పందించాలి. అన్ని శాఖల్లో మెరుగైన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే’’ అని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని