మరో 29 ఐపీఎస్‌ పోస్టులు కేటాయించండి

‘‘రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్‌ పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిపాలన అవసరాల దృష్ట్యా మరో 29 పోస్టులు కేటాయించండి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు.

Published : 05 Jul 2024 03:32 IST

అమిత్‌షాకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి

హోంమంత్రి అమిత్‌షాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, పక్కన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఈనాడు, దిల్లీ: ‘‘రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్‌ పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిపాలన అవసరాల దృష్ట్యా మరో 29 పోస్టులు కేటాయించండి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. రాష్ట్ర అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునికీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యాంశాలు ఇలా..

  • డ్రగ్స్, సైబర్‌ నేరాలను అరికట్టడానికి కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల కొనుగోలు కోసం టీజీ న్యాబ్‌కు రూ.88 కోట్లు, టీజీ సీఎస్‌బీకి రూ.90 కోట్లు కేటాయించాలి.
  • తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో సెక్యూరిటీ ఫోర్స్‌ క్యాంపుల మాదిరిగానే రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలి. గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా ఉండి తొలగించిన ఈ మూడు జిల్లాలకు భద్రతాపరమైన వ్యయ చెల్లింపులను కొనసాగించాలి.
  • రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణిచి వేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సీఆర్పీఎఫ్, జేటీఎఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని కర్రె గుట్టల కొండల్లో ఉన్న అనుకూలతను ఆసరాగా చేసుకొని సీపీఐ మావోయిస్టు కమిటీ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి ప్రాబ్యల విస్తరణకు ప్రయత్నిస్తోంది. మావోయిస్టు ప్రత్యేక దళం కదలికల నియంత్రణకు జేటీఎఫ్‌ క్యాంపులు ఉపయోగకరం. మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఎస్పీవోల నిమిత్తం కేంద్రం వాటా 60 శాతం కింద నాలుగేళ్ల నుంచి చెల్లించాల్సిన రూ.18.31 కోట్లు విడుదల చేయాలి.
  • ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే చేర్చుకోవాలనే నిబంధన సమాచారం చేరవేతకు ఇబ్బందిగా ఉంది. వారు అందుబాటులో లేనందున 1,065 మంది ఇతరులను ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి వీలుగా నిబంధనలు సడలించాలి.
  • పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలి. షెడ్యూల్‌ 9లోని (చట్టంలోని 53, 68, 71 సెక్షన్ల ప్రకారం) ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్‌ పదిలోని సంస్థల వివాదం (చట్టంలోని 75 సెక్షన్‌ ప్రకారం) సామరస్యపూర్వకంగా పరిష్కారమయ్యేలా చూడాలి. పునర్విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ క్లెయిమ్‌ చేసుకుంటున్నందున, అందులో తెలంగాణకు న్యాయం జరిగేలా చొరవ చూపాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని