- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 Worlc cup: ఈ ప్రపంచకప్ వేరయా..
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు.
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. తొలిసారి 20 జట్లు ఆడటం, అమెరికా ఆతిథ్యం, మందకొడి పిచ్లు, అఫ్గానిస్థాన్ సంచలన ప్రదర్శన, దక్షిణాఫ్రికా స్ఫూర్తిదాయక ప్రయాణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలున్నాయి.
రికార్డు సంఖ్యలో..: టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి 20 జట్లతో జరిగిన టోర్నీ ఇదే. దీంతో చిన్న దేశాలకూ పెద్ద జట్లతో తలపడే అవకాశం వచ్చింది. అయితే కూనలు ఉత్తమ ప్రదర్శనతో టోర్నీని రసవత్తరంగా మార్చాయి. బౌలింగ్ అనుకూల పరిస్థితుల్లో పెద్ద జట్లకు ఇవి సవాలు విసిరాయి. పాపువా న్యూ గినీపై వెస్టిండీస్, స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా, ఐర్లాండ్పై పాకిస్థాన్.. నెదర్లాండ్స్, నేపాల్పై దక్షిణాఫ్రికా చెమటోడ్చి గెలిచాయి. నేపాల్పై సఫారీ జట్టు ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది.
సఫారీలు తొలిసారి: ఐసీసీ టోర్నీలంటే చాలు దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతుందనే అభిప్రాయాలుండేవి. ఈ టోర్నీకి ముందు ఆ జట్టు ఒక్కసారి కూడా సెమీస్ దాటకపోవడమే అందుకు కారణం. టీ20 ప్రపంచకప్ల్లో చూసుకుంటే 2009, 2014లో ఆ జట్టు సెమీస్లోనే నిష్క్రమించింది. మిగతా టోర్నీల్లో రెండో రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. కానీ ఈ సారి సఫారీ జట్టు ఆ ముద్ర చెరిపేసుకుంది. టోర్నీలో తీవ్ర ఒత్తిడి సమయాల్లో పట్టుదలతో నిలిచిన ఆ జట్టు మొట్టమొదటి సారి ఓ ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది. తుదిపోరులోనూ పోరాడి ఓడింది. డికాక్, మిల్లర్, క్లాసెన్, స్టబ్స్ బ్యాట్తో.. నోకియ, రబాడ, షంసి, మహరాజ్ బంతితో మెరిశారు. మరోవైపు పెద్ద జట్లకూ ఈ టోర్నీలో గట్టిషాక్లే తగిలాయి. గత రెండు ప్రపంచకప్ల్లోనూ కనీసం సెమీస్ చేరిన న్యూజిలాండ్, పాకిస్థాన్ ఈ సారి గ్రూప్ దశలోనే వెళ్లిపోయాయి.
బ్యాటింగ్.. అమ్మో
టీ20లు అంటేనే ధనాధన్ బ్యాటింగ్ ప్రదర్శనలు గుర్తుకొస్తాయి. బ్యాటర్ల చేతుల్లో బౌలర్ల ఊచకోత కళ్ల ముందు మెదులుతుంది. కానీ ఈ టీ20 ప్రపంచకప్లో కథ అడ్డం తిరిగింది. బంతి దూకుడుకు బ్యాట్ భయపడింది. అందుకు ప్రధాన కారణం ఆతిథ్య దేశాలైన అమెరికా, వెస్టిండీస్లోని పరిస్థితులు, పిచ్లు. ముఖ్యంగా తొలిసారి ఈ పొట్టికప్కు ఆతిథ్యమిచ్చిన యుఎస్.. నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలోని పిచ్ల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన ఈ డ్రాప్ ఇన్ పిచ్లు కుదురుకునేందుకు సమయం లేకపోవడంతో అస్థిర బౌన్స్తో బ్యాటర్లకు ప్రమాదకరంగా మారాయి. మరోవైపు వెస్టిండీస్లోని స్పిన్ పిచ్లు కూడా బ్యాటర్లకు కళ్లెం వేశాయి. ఈ టోర్నీలో 55కు గాను వర్షంతో రద్దయిన 4 పోను 51 మ్యాచ్లు జరిగాయి. అంటే 102 ఇన్నింగ్స్లు. ఇందులో దాదాపు సగం అంటే 50 ఇన్నింగ్స్ల్లో 120 కంటే తక్కువ పరుగులే నమోదయ్యాయి. అంటే బంతికో పరుగు కూడా రాలేదు. కేవలం నాలుగు ఇన్నింగ్స్ల్లోనే స్కోరు 200 దాటింది. ఓవరాల్గా ఇప్పటి వరకూ జరిగిన 9 ప్రపంచకప్ల్లో జట్లు చేసిన అత్యల్ప స్కోర్ల జాబితాలో తొలి పది స్థానాల్లో ఈ సారి నమోదైన స్కోర్లే అయిదున్నాయి. అత్యల్ప స్కోరూ (ఉగాండా 39) ఈ ప్రపంచకప్లోనిదే.
అఫ్గాన్ ప్రకంపనలు
2024 టీ20 ప్రపంచకప్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అఫ్గానిస్థాన్ సంచలన ప్రదర్శన కచ్చితంగా గుర్తుకొస్తుంది. తమది ఏ మాత్రం చిన్న జట్టు కాదని ఈ టోర్నీలో అఫ్గాన్ వీరులు అసాధారణ ప్రదర్శనతో సెమీస్ వరకూ వచ్చారు. గ్రూప్ దశలో న్యూజిలాండ్ను చిత్తుచేసి.. సూపర్-8లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్పై గెలిచి అదరగొట్టారు. సెమీస్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయినా ఈ టోర్నీలో అఫ్గాన్ ఆటగాళ్ల తెగువ, పోరాట పటిమ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. బ్యాటింగ్లో రహ్మనుల్లా గుర్బాజ్ (281 పరుగులు), ఇబ్రహాం జద్రాన్ (231).. బౌలింగ్లో ఫజల్హక్ ఫారూఖీ (17 వికెట్లు), రషీద్ ఖాన్ (14), నవీనుల్ హక్ (13) అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ చిరస్మరణీయ ప్రదర్శనలో కీలకమయ్యారు.
అమెరికా అదుర్స్
ఆతిథ్య హోదాలో తొలిసారి ప్రపంచకప్ ఆడిన అమెరికా అద్భుత ఆటతీరుతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా గొప్పే అనుకుంటే.. ఏకంగా పాకిస్థాన్పై సంచలన విజయంతో సూపర్-8లో అడుగుపెట్టింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఆ పోరులో అమెరికా సూపర్ ఓవర్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. యుఎస్లో క్రికెట్కు ఆదరణ పెంచే దిశగా అక్కడ ప్రపంచకప్ మ్యాచ్లను ఐసీసీ నిర్వహించింది. ఈ టోర్నీలో అమెరికా ప్రదర్శనతో ఆ దేశంలో ఆటకు ప్రాచుర్యం పెరగడంతో పాటు మరికొన్ని దేశాలు కూడా క్రికెట్ బాట పట్టే అవకాశముంది. చిన్న జట్ల ప్రదర్శన మరింత స్ఫూర్తినిచ్చేదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ వారసుడెవరు?
ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్.. మళ్లీ ఇప్పుడు భారత్ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్బై చెప్పాడు రోహిత్ శర్మ. -
అంతా కలలాగే..
టీ20 ప్రపంచకప్ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు. -
ఆ రోజు నన్నాపింది రోహితే
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
వందలో మరో చిరుత
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. -
వింబుల్డన్ ఛాంపియన్కు చెక్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది. -
క్వార్టర్స్లో ఫ్రాన్స్
ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు యూరో 2024 క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. -
భారత జట్టులో సాయి, జితేష్
యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. -
పారిస్ ఒలింపిక్స్లో జ్యోతి!
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్ కోటాలో జ్యోతి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.