T20 World Cup Final: టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్ మ్యాచ్‌.. హాట్‌స్టార్‌లో వ్యూయర్‌షిప్‌ ఎంతంటే?

భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు డిస్నీ+హాట్‌స్టార్‌లో భారీస్థాయిలో వ్యూయర్‌షిప్‌ వచ్చింది. 

Published : 01 Jul 2024 00:06 IST

ఇంటర్నెట్ డెస్క్: 13 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించుతూ పొట్టికప్‌లో విశ్వవిజేతగా నిలిచింది భారత్. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో టీమ్‌ఇండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ నాటకీయ మలుపులు తిరుగుతూ.. తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగింది. దీంతో అభిమానులు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి మ్యాచ్‌ని వీక్షించారు. ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) ఫైనల్‌ మ్యాచ్‌కు భారీస్థాయిలో వ్యూయర్‌షిప్‌ వచ్చింది. ఈ మ్యాచ్‌ను 5.3 కోట్ల మంది వీక్షించినట్లు సదరు సంస్థ పేర్కొంది.

భారత్, ఆసీస్‌ మధ్య జరిగిన నవంబర్‌ 20, 2023న జరిగిన వన్డే వరల్డ్ ఫైనల్‌ను రికార్డు స్థాయిలో 5.9 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు మరే క్రికెట్‌ మ్యాచ్‌కు ఈ స్థాయిలో లైవ్‌ స్ట్రీమింగ్‌ వ్యూయర్ షిప్‌ రాలేదని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. కానీ, అప్పటి ఫైనల్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలైంది. ఈ టీ20 ప్రపంచ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 3.9 కోట్ల మంది వీక్షించారు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. టీవీల్లో ఎంతమంది వీక్షించారనే గణాంకాలను బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) వారం రోజుల తర్వాత వెల్లడిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని