YS jagan: అధ్యక్షా.. మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి: వైఎస్‌ జగన్‌

అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

Updated : 25 Jun 2024 15:32 IST

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు.  ‘‘ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా.. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది. 

ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంటులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నాను. 1984లో లోక్‌సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా 30 ఎంపీ సీట్లు గెలుచుకుంది. సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు తెదేపాకు చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 

1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లేకపోయినా పి.జనార్దన్‌రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను భాజపా కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నా. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నా’’ అని జగన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని