NDA vs INDIA bloc: పొత్తులు కట్టి... శక్తుల్ని కూడదీసి!

సుదీర్ఘంగా సాగిన లోక్‌సభ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. మరికొన్ని గంటల్లో విజేతలెవరో తేలిపోనుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువరించాయి.

Published : 04 Jun 2024 05:22 IST

హోరాహోరీగా తలపడిన ఎన్డీయే, ఇండియా 
భాగస్వాములను నడిపించిన భాజపా, కాంగ్రెస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘంగా సాగిన లోక్‌సభ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. మరికొన్ని గంటల్లో విజేతలెవరో తేలిపోనుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువరించాయి. మూడోసారి గెలవాలని ఎన్డీయే, దాన్ని అడ్డుకోవాలని ఇండియా కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఇంతకీ ఈ కూటముల్లో ఏ పార్టీలున్నాయి? ఏ కూటమిలోనూ చేరని పార్టీలేవి?... 

‘మిషన్‌ 400’తో ఏన్డీయే 

హాట్రిక్‌పై దృష్టి సారించిన భాజపా చిన్నచిన్న పార్టీలనూ తన ఎన్డీయే కూటమిలో కలుపుకొంది. ‘అబ్‌కీ బార్‌ 400 పార్‌’ అనే నినాదంతో... ఒంటరిగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కశ్మీర్‌లోని మూడు స్థానాలు మినహా దేశవ్యాప్తంగా 540 సీట్లలో పోటీ చేసింది. ప్రస్తుత  లోక్‌సభలో ఎన్డీయే బలం 336 సీట్లుగా ఉంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకుగానూ 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపా తన మిత్రులతో కలిసి బరిలో నిలిచింది. మిగిలినచోట్ల సొంతంగా పోటీ చేస్తోంది.

భాజపా తర్వాత తెదేపానే

ఎన్డీయేలో భాజపానే అతిపెద్ద పార్టీ. అది 441 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఆ తర్వాత 17 చోట్ల పోటీ చేస్తున్న తెదేపానే రెండో అతిపెద్ద పార్టీ. ఇవికాకుండా జేడీయూ (16), ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన (15), తమిళనాడులో అన్బుమణి రాందాస్‌ నేతృత్వంలోని పట్టలి మక్కల్‌ కట్చి (10), లోక్‌ జనశక్తి పార్టీ (5), అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ (5) ప్రధాన పార్టీలు. కూటమిలో జేడీఎస్‌ (3), జనసేన (2), అప్నాదళ్‌ (సోనేలాల్‌) (2), ఏజీపీ (2), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (2), రాష్ట్రీయ లోక్‌దళ్‌ (2) వంటి పార్టీలున్నాయి. మరో ఎనిమిది చిన్నపార్టీలు ఒక్కోచోట పోటీ చేస్తున్నాయి. 

మోదీని దింపడమే లక్ష్యంగా ఇండియా

మోదీ సర్కారును గద్దె దించాలన్న లక్ష్యంతో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీయే కూటమి ఉండగా.. ఈసారి మరిన్ని పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటైంది. దీని కూర్పులో కీలకంగా వ్యవహరించిన నీతీశ్‌ కుమార్‌ (జేడీయూ) చివరి నిమిషంలో ఎన్డీయే గూటికి చేరడం గమనార్హం. కాంగ్రెస్‌ మునుపెన్నడూ లేనంత తక్కువగా 326 స్థానాల్లోనే పోటీ చేసింది. కూటమిలో ఎస్పీ(62), ఆర్‌జేడీ(24), డీఎంకే(22), శివసేన(21), శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ(10) ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వీటితోపాటు టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఆప్, జేఎంఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్, వికాశ్‌శీల్‌ ఇన్సాన్‌లతోపాటు మరికొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి.

కూటమిలోనే పోటాపోటీ

కొన్నిచోట్ల సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం, స్థానిక పరిస్థితుల కారణంగా ఇండియా కూటమిలోని పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడ్డాయి. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో దిగాయి. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీపై కాంగ్రెస్, సీపీఎంలు కలిసి పోటీ చేశాయి. ఆప్, కాంగ్రెస్‌ల మధ్య దిల్లీలో పొత్తు కుదరగా, పంజాబ్‌లో మాత్రం ప్రత్యర్థులుగా అవి తలపడ్డాయి. 

ఏ కూటమిలో చేరకుండా...

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, తెలంగాణలో భారాస, ఎంఐఎంలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ, తమిళనాడులో అన్నాడీఎంకే, ఒడిశాలో బిజద, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌లు ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగా పోటీ చేశాయి. హరియాణాలోని జననాయక్‌ జనతా పార్టీ చివరి నిమిషంలో ఎన్డీయేను వీడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని