MLC bypoll: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్‌

ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్‌డీయే కూటమి అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు.

Published : 02 Jul 2024 06:55 IST

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్‌డీయే అభ్యర్థుల ఖరారు

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్‌డీయే కూటమి అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. వారిలో ఇక్బాల్‌ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా, రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దాంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. వారిలో తెదేపా సీనియర్‌ నేత సి.రామచంద్రయ్యకు ఎన్‌డీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి.హరిప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వారిద్దరూ మంగళవారం నామినేషన్‌ వేయనున్నారు. శాసనసభలో ఎన్‌డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వారిద్దరి ఎన్నిక లాంఛనమే. 

సీఏగా మొదలై... రాజకీయ నేతగా ఉన్నత పదవులు..!

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గుడ్లవారిపల్లెకి చెందిన సి.రామచంద్రయ్య చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పని చేశారు. తెదేపా స్థాపనతో ఆ పార్టీలో చేరిన ఆయన 1985లో అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి గెలిచారు. 1986లో 20 సూత్రాల అమలు శాఖకు మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత తెదేపా నుంచి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు.  2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ నుంచి 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో 2012 నుంచి దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.  2018లో వైకాపాలో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పని చేశారు.  2021 మార్చి 8న శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జనవరి 3న వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు.

పాత్రికేయుడిగా ప్రస్థానం ప్రారంభించి..

ఏలూరుకు చెందిన పిడుగు హరిప్రసాద్‌ డిగ్రీ వరకు అక్కడే చదివి విజయవాడ సిద్ధార్థ కళాశాలలో బీఎల్‌ పూర్తి చేశారు. లా చేసినప్పటికీ జర్నలిజంలో కొనసాగారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా రంగంలో హరిప్రసాద్‌కు విశేష అనుభవం ఉంది. సుమారు పాతికేళ్లపాటు మీడియా రంగంలో పని చేశారు. ఈనాడు, ఈటీవీ2లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. మాటీవీలో న్యూస్‌ హెడ్‌గా పని చేశారు. అదే ఛానల్‌లో కొద్దికాలం అసోసియేట్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత సీవీఆర్‌ హెల్త్‌ ఛానల్, సీవీఆర్‌ హెల్త్‌ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా, సీవీఆర్‌ న్యూస్‌ టీవీకి కరెంట్‌ అఫైర్స్‌ హెడ్‌గా ఏకకాలంలో సేవలందించారు. జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా హెడ్‌గా, పవన్‌కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని