Ram Mohan Naidu: నిండు సభలో ప్రతిన బూనారు.. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు!

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి, తెదేపా యువ నేత రామ్మోహన్‌ నాయుడు తొలిసారి కేంద్ర మంత్రిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు...

Published : 10 Jun 2024 00:03 IST

టెక్కలి:  పార్లమెంటులో ఓ చర్చ జరుగుతున్న సమయంలో తమకు మాట్లాడటానికి ఇంకాస్త సమయం కావాలని అడిగారు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. అప్పటి స్థానాల లెక్కల ప్రకారం ఆయన మాట్లాడే సమయం చాలా తక్కువ. మామూలుగా ఎవరైనా రిక్వెస్ట్‌  చేసి మాట్లాడి ముగిస్తారు. రామ్మోహన్‌ మాట్లాడటమే కాదు.. ‘వచ్చేసారి పార్లమెంట్‌కు తమ పార్టీ ఎక్కువ మెజారిటీతో వస్తుందని, అప్పుడు సమయం గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని గట్టిగా చెప్పారు. ఆయన సంకల్ప బలం, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో రామ్మోహన్‌ నాయుడు మూడోసారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. 

తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబరు 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌ నాయుడు (Ram Mohan Naidu Kinjarapu) రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో తెదేపా తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ఓటమిపాలయినా తాను మాత్రం ఎంపీగా గెలిచి, పట్టు నిలబెట్టుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

రామ్మోహన్‌నాయుడి చిన్నాన్న అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు. సోదరి ఆదిరెడ్డి భవాని మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామ్మోహన్‌ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

స్వస్థలం: నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా
వయసు: 36 సంవత్సరాలు
విద్యార్హత: బీటెక్, ఎంబీఏ 
తల్లిదండ్రులు: విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు 
భార్య: శ్రావ్య
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని