Jupally KrishnaRao: బంగారుపళ్లెం కాదు.. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: జూపల్లి

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Updated : 19 Jan 2024 17:47 IST

హైదరాబాద్‌: తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘‘భారాస ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది. రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోంది. భాజపా తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో భారాస మద్దతు ఇచ్చింది. ఇరుపార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందువల్లే రూ.వేల కోట్లు కుమ్మరించినా.. శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదు. 

2018 ఎన్నికలప్పుడు భారాస చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదు. గతంలో విపక్షాలు తెరాసను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. పసికందును విమర్శిస్తున్నారా?అని వాపోయారు. మరి భారాస నేతలు 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసింది. మిగతా గ్యారంటీల అమలు కోసమే ‘ప్రజాపాలన’ నిర్వహించాం. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే మిగతావి అమలు చేస్తాం. 

లోక్‌సభ ఎన్నికల్లో భారాస తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారు. భారాసను వీడటానికి ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ప్రతినిధులే అవిశ్వాసాలు పెడుతున్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్‌లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు ఇవ్వలేదు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్‌లో జలాలు అడుగంటిపోయాయి. కృష్ణా బేసిన్‌లో నీరు లేనప్పుడు రెండో పంటకు ఇవ్వడం ఎలా సాధ్యం?’’ అని జూపల్లి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని