తెదేపా నాయకులపై పెప్పర్‌ స్ప్రేతో వైకాపా నేత దాడి

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా, ఓటమి అక్కసుతో వైకాపా నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Published : 07 Jul 2024 05:28 IST

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఘటన

నల్లజర్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా, ఓటమి అక్కసుతో వైకాపా నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తెదేపా నాయకులు గురుమిల్లి వెంకట సూర్యనారాయణ, చింతా గణేశ్‌ శనివారం గ్రామంలోని తాగునీటి ట్యాంకు వద్ద ఉండగా.. వైకాపా కార్యకర్త యెర్నిని సన్యాసిరావు అటుగా వచ్చారు. తెదేపా విజయాన్ని ప్రస్తావిస్తూ సూర్యనారాయణతో గొడవపడ్డారు. దుర్భాషలాడి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సూర్యనారాయణ కులపెద్ద విప్పల వీరరాఘవకు ఫిర్యాదు చేయగా, ఆయన ఇరువర్గాలను పిలిచి పంచాయితీ పెట్టారు. అక్కడా మాటామాటా పెరిగి సన్యాసిరావు తనవెంట తెచ్చుకున్న పెప్పర్‌ స్ప్రేను సూర్యనారాయణ, గణేశ్‌ల కళ్లలో కొట్టి పరారయ్యారు. స్థానికులు బాధితులను తొలుత 108 వాహనంలో నల్లజర్ల ప్రభుత్వాసుపత్రికి, అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని స్థానిక తెదేపా నాయకులు పరామర్శించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని