ఖర్గే స్థానంలో జైరాం ఉంటే బాగుండేది

Published : 03 Jul 2024 04:19 IST

రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌
తీవ్రంగా స్పందించిన ఖర్గే

దిల్లీ: రాజ్యసభలో మంగళవారం వాడీవేడి వాతావరణం నెలకొంది. ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఖర్గే వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన ధన్‌ఖడ్‌.. ఛైర్మన్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే స్థానంలో జైరాం రమేశ్‌ కూర్చుంటే బాగుండేదన్నారు. ‘ఛైర్మన్‌ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ చూడలేదు. సమావేశం మధ్యలో తరచూ లేచి మీకు తోచింది మాట్లాడుతున్నారు. అయినా.. మీ గౌరవాన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నించా’ అని ఖర్గేపై ధన్‌ఖడ్‌ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఏదో చెప్పడానికి లేచి నిలబడితే ఛైర్మన్‌ ఆయనను వారించారు. ‘మీరు చాలా తెలివైనవారు. ప్రతిభావంతులు. ఖర్గే చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. వచ్చి ఆయన స్థానంలో కూర్చోండి’ అని ధన్‌ఖడ్‌ సూచించారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ స్థానం కల్పించారు. బాధ్యతలను అప్పగించారు. ఆమెవల్లే నేను ఇక్కడ కూర్చున్నా’ అని బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని