మెజార్టీల్లో భాజపా రికార్డుల మోత..

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నేతల్లో పలువురు భారీ మెజార్టీ సాధించి రికార్డులు సృష్టించారు. ఇందౌర్‌ లోక్‌సభ స్థానం సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ ఏకంగా 11.75 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి చరిత్ర తిరగరాశారు.

Published : 05 Jun 2024 05:39 IST

11.7 లక్షలతో శంకర్‌ లాల్వానీ టాప్‌

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నేతల్లో పలువురు భారీ మెజార్టీ సాధించి రికార్డులు సృష్టించారు. ఇందౌర్‌ లోక్‌సభ స్థానం సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ ఏకంగా 11.75 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి చరిత్ర తిరగరాశారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీఎస్పీ అభ్యర్థి సంజయ్‌ సోలంకీకి 51,659 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. దేశవ్యాప్తంగా భారీ మెజార్టీ సాధించిన తొలి అయిదుగురు నేతల్లో నలుగురు భాజపాకు చెందినవారే కావడం గమనార్హం. ఇప్పటిదాకా సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు భాజపా నేత ప్రీతమ్‌ ముండే పేరిట ఉండేది. మహారాష్ట్రలోని బీడ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఈమె 2014లో 6.96 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తాజాగా ఆ రికార్డును లాల్వానీ అధిగమించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, గుజరాత్‌ భాజపా చీఫ్‌ సీఆర్‌ పాటిల్‌ ఏడు నుంచి ఎనిమిది లక్షలకు పైగా మెజార్టీ సాధించినవారి జాబితాలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి పోటీ చేసిన పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (భాజపా) 5 లక్షలకు పైగా, పశ్చిమ త్రిపుర నుంచి బరిలోకి దిగిన మాజీ సీఎం బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ (భాజపా) 6 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యత సాధించారు. గుజరాత్‌తోని వడోదర భాజపా అభ్యర్థి హేమాంగ్‌ జోషి, యూపీలోని గౌతంబుద్ధ నగర్‌ నుంచి మహేష్‌శర్మ (భాజపా) సైతం 5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని