TDP: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు

వైకాపా హయాంలో తెదేపా (TDP) కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Updated : 03 Jul 2024 13:38 IST

వైకాపా మూకలు దాడి చేసిన సమయంలోని ఓ దృశ్యం

మంగళగిరి: వైకాపా హయాంలో తెదేపా (TDP) కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బుధవారం ఐదుగురు వైకాపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిలో గుంటూరుకు చెందిన వెంకట్‌రెడ్డి, మస్తాన్‌వలి, దేవానందం, రాంబాబు, మొహియుద్దీన్‌ ఉన్నారు. 2021 అక్టోబరు 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైకాపా మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.

నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను గత మూడు, నాలుగు రోజులుగా సేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధరించారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు తెదేపాలో చేరతామని రాయబారాలు కూడా నడిపినట్లు సమాచారం. అయినా, పోలీసులు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, విద్యార్థి విభాగం నాయకులను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిలో కొందరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని