jagan: ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!

‘ఫలితాలు చూశాక.. షాక్‌ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్‌ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలివి.

Updated : 29 Jun 2024 08:34 IST

40 శాతం ఓట్లు చూసి ఆగిపోయా 
వైకాపా నేతలతో జగన్‌ వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ‘ఫలితాలు చూశాక.. షాక్‌ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్‌ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలివి. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటికొచ్చాయి. ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయనీ మాటలు అన్నట్లు తెలిసింది. ‘నిజంగా వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్‌లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది. కానీ, ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి, అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది. దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటికొచ్చా. ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయనేందుకు అనుమానాలు, కారణాలు ఏవి ఉన్నా, మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలి. సర్వేలు చేయించాం, వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదు. అందువల్లే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయి. వాటిని చూసినపుడు నా పరిస్థితే ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో మీకూ ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను బయటికొచ్చినట్లే మీరూ ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కండి’ అని నేతలతో ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని