Lok Sabha: మోదీవే అసత్య ప్రకటనలు.. చర్యలు తీసుకోండి: కాంగ్రెస్‌

ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ అసత్య ప్రకటనలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని, వారిపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ లేఖ రాసింది.

Published : 04 Jul 2024 18:39 IST

దిల్లీ: రాజ్యాంగానికి అతిపెద్ద వ్యతిరేకి కాంగ్రెస్‌ పార్టీయేనని, ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కల్లబొల్లిమాటలు చెబుతోందని ప్రధాని మోదీ (PM Modi) విమర్శించిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ లేఖాస్త్రం సంధించింది. మోదీ, భాజపా ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur)సత్యదూరమైన ప్రకటనలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాణికం ఠాగూర్‌ (Manickam Tagore) లేఖ రాశారు. రాజ్యాంగంలోని 115(1) నిబంధన ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిబంధనల ప్రకారం ఎవరైనా ఎంపీ సభలో అసత్య ప్రకటనలు చేస్తే.. సభాముఖంగా వాటిని తూర్పారబెట్టాలని ఎవరైనా సభ్యులు భావించినప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తక ముందే సభాపతికి లేఖ రాయాల్సి ఉంటుంది. చర్చ జరిపిన తర్వాత ఆ ప్రకటనలు తప్పని నిరూపిస్తే.. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తారు.

మంగళవారం ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్‌ తప్పుడు వాగ్దానం చేసిందని అన్నారు. ఈ అంశాన్ని ఠాకూర్‌ లేఖలో ప్రస్తావించారు. విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పామని, అది తప్పుడు వాగ్దానం ఎలా అవుతుందని ప్రశ్నించారు?ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసిన రాష్ట్రాల్లో 16 చోట్ల ఓట్‌ షేర్‌ పడిపోయిందని మోదీ అన్నారని, అయితే, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓట్‌ షేర్ అనూహ్యంగా పెరిగిందని, మోదీవి తప్పుడు ప్రకటనలు కాదా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ హయాంలో ఆర్మీ జవాన్లకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను కేంద్రం సమకూర్చలేదని ప్రధాని మోదీ అనడం ఏమాత్రం సరికాదని, అప్పట్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల కొరత ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, అసలు జాకెట్లే లేవని చెప్పడం సమంజసం కాదన్నారు. ముంబయి దాడుల సమయంలో స్థానిక పోలీసులకు కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు సమకూర్చామని చెప్పారు. ఇండియన్‌ ఆర్మీకి ఫైటర్‌ జెట్‌లను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వలేదని మోదీ చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జాగ్వార్‌, మిగ్‌ 29, ఎస్‌యూ-30, మిరాజ్‌-2000 లాంటి ఫైటర్‌ జెట్‌లతో న్యూక్లియర్‌ బాంబులు, అగ్ని, పృథ్వీ, అకాశ్‌, నాగ్‌, త్రిశూల్‌ ఆ తర్వాత బ్రహ్మోస్‌ లాంటి అద్భుత క్షిపణులు అందుబాటులో ఉన్నాయన్నారు.

భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మందిని అభివృద్ధి పథంవైపు నడిపంచామన్న ఠాకూర్‌ వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ పని చేస్తున్నారని పాలక పక్షం గొప్పలు చెప్పుకుంటోందని, వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలకు వెళ్లిన మోదీ.. ఏ రకమైన సెలవులు తీసుకొని వెళ్లారో సభకు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఇలా అధికార భాజపా అసత్య ప్రకటనలు రికార్డులో ఉంచుతూ.. నిజం మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్‌ వ్యాఖ్యలను ఎలాంటి చర్చ లేకుండానే రికార్డుల నుంచి తొలగించడం సరికాదని ఠాకూర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బుధవారం రాజ్యసభలో మోదీ సమాధానమిస్తూ.. రాజ్యాంగాన్ని కాపాడడమనే అంశంపై ఎన్నికల్లో పోరాడినట్లు విపక్షం చెప్పడాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని