Chandrababu: పోలవరాన్ని చూస్తే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: సీఎం చంద్రబాబు

పోలవరాన్ని జగన్‌ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన..  విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్‌ చేసిన నష్టమే ఎక్కువన్నారు.

Updated : 28 Jun 2024 19:54 IST

అమరావతి: పోలవరాన్ని జగన్‌ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్‌ చేసిన నష్టమే ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజల ముందుంచిన ఆయన.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘‘ పోలవరం గురించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలూ తీసుకుంటాం. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి. 25 రోజుల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. వెబ్‌సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతాం’’ అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గత సీఎం జగన్‌ అసెంబ్లీ వేదికగా ఏటా చేసిన ప్రసంగాలతో పాటు మంత్రిగా అంబటి రాంబాబు చేసిన ప్రకటన వీడియోలను మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రదర్శించారు.

పోలవరానికి జగన్‌ ఓ శాపం..: చంద్రబాబు

‘‘పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం ఇస్తాం. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. నదుల అనుసంధానానికి గుండెలాంటిది. ఇలాంటి పోలవరానికి జగన్‌ ఒక శాపంలా మారారు. ఈ ప్రాజెక్టు విషయంలో క్షమించరాని నేరం చేశారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండూ ప్రధాన ప్రాజెక్టులు. ఈ రెండూ రాష్ట్రానికి రెండు కళ్లులాంటివి. ఈ రెండూ పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని పూడ్చుకొనే అవకాశం ఉంటుంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహం. రాష్ట్ర అభివృద్ధికి జలవిద్యుత్‌ కీలకం. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయ రంగానికి ఊతం వస్తుంది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్‌ చేసిన నష్టమే అధికం. 2014-19 మధ్య పోలవరానికి రూ.11,762 కోట్లు ఖర్చు చేశాం. వైకాపా ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జగన్‌ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. జగన్‌ ప్రమాణం చేస్తూనే పోలవరం పనులు ఆపేశారు’’ అన్నారు.

ఆ హెచ్చరికలనూ పెడచెవినపెట్టారు..

ప్రత్యామ్నాయం లేకుండా కాంట్రాక్టర్లను తొలగించారు. సమర్థులైన అధికారులను బదిలీ చేశారు. డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతిందని హైదరాబాద్‌ ఐఐటీ బృందం చెప్పింది. ఆ విషయం జగన్‌కు రెండేళ్ల తర్వాత తెలిసింది. కాంట్రాక్టర్లను మార్చొద్దని పీపీఏ హెచ్చరించింది. 2009లోనూ వైఎస్‌ కాంట్రాక్టర్‌ను మార్చారు. వైఎస్‌ కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల హెడ్‌ వర్క్స్‌ నిలిచిపోయాయి. ఆయన చేసిన తప్పే జగన్‌ కూడా చేశారు. పీపీఏ హెచ్చరికలను జగన్‌ పెడచెవిన పెట్టారు. 2019 ఆగస్టు 16న సీఎస్‌కు పీపీఏ లేఖ రాసింది. ఏజెన్సీలను మార్చొద్దని స్పష్టంగా చెప్పింది. నీతిఆయోగ్‌ బృందం నాటి సర్కారు తప్పిదాలను ఎత్తి చూపింది. కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌లు పూర్తి చేసేటప్పుడు ఏజెన్సీని మార్చారు. 2018లో డయాఫ్రమ్‌వాల్‌ను రూ.436 కోట్లతో మేం పూర్తి చేస్తే.. దాని మరమ్మతులకే రూ.447 కోట్లు ఖర్చయింది. కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుంది. దీని నిర్మాణానికి కనీసం రెండు సీజన్లు అవసరం. కాఫర్‌ డ్యామ్‌ సీపేజ్‌ వల్ల ఏ పనులూ చేసే పరిస్థితి లేదు. 

ఐదేళ్లలో 3.84శాతం పనులే జరిగాయి.. రూ.3,385 కోట్లు మళ్లించారు..

జగన్‌ చేసిన విధ్వంసంతో పోలవరం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు మారాయి. జగన్‌ సర్కార్‌ అసమర్థతతో గైడ్‌బండ్ కుంగిపోయింది. రూ.80 కోట్లతో నిర్మించిన ఈ గైడ్‌బండ్‌ నిరుపయోగంగా మారింది. తెదేపా హయాంలో పోలవరం 72 శాతం పూర్తయితే.. వైకాపా హయాంలో కేవలం 3.84 శాతం పనులే జరిగాయి. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.3,385 కోట్లు మళ్లించారు. తెదేపా హయాంలో పోలవరం పనులకు ప్రశంసలు దక్కితే.. వైకాపా హయాంలో పీపీఏ, ఐఐటీ నిపుణుల చీవాట్లు దక్కాయి. పోలవరం మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నాం. వాళ్లు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారు. ఏజెన్సీని మార్చకపోతే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యాది. జగన్‌ సర్కారు నిర్లక్ష్యంతో రూ.4,900 కోట్ల నష్టం జరిగింది. ఖర్చు 38 శాతం పెరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్‌ ఉత్పత్తి కోల్పోయాం. దీని ద్వారా రూ.3 వేల కోట్లు నష్టపోయాం. పోలవరం ఆలస్యంతో రైతులకు రూ.45 వేల కోట్ల నష్టం జరిగింది’’ అని వివరించారు.

కేంద్రం తోడ్పాటుతో సవాళ్లు అధిగమిస్తాం..

అంతర్జాతీయ, దేశీయ నిపుణుల సాయంతో సమస్యని అధిగమిస్తాం. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో సవాళ్లు అధిగమిస్తాం. ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మతు ఇంకా కష్టమైన పని. పోలవరం కోసం మేం పడిన శ్రమను జగన్‌ వృథా చేశారు. అర్హత లేనివారికి అధికారం వస్తే అరాచకాలే జరుగుతాయి. కాఫర్‌ డ్యామ్‌ ఎక్కడ ఉందో తెలియని వారు మాపై విమర్శలు చేశారు. పోలవరం ఎంతకాలంలో బాగు చేయగలమో నిపుణులే తేల్చాలి. జగన్‌ అరాచకంతో నిపుణులు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. పోలవరంలో తప్పులు చేసిన అధికారుల్ని మారుస్తున్నాం. పోలవరంలో ప్రధాన దోషిని జనం ఇంటికి పంపారు. పోలవరం ఎత్తు విషయంలో రాజీ లేదు. అందరం సమష్టిగా పనిచేసి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని