Chandrababu: దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరే ఉద్దేశంతో చంద్రబాబు బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు.

Updated : 04 Jul 2024 06:53 IST

పలువురు కేంద్ర మంత్రులనూ కలవనున్న సీఎం

దిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరే ఉద్దేశంతో చంద్రబాబు బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ప్రసాద్‌ ఇతర అధికారులు ముఖ్యమంత్రి వెంట దిల్లీ వచ్చారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి తెదేపా, భాజపా, జనసేన ఎంపీలతో సమావేశయ్యారు. పార్లమెంటు తొలి సమావేశాలు జరిగిన తీరును తెలుసుకొని, భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై చర్చించారు. ముఖ్యమంత్రి ఈ పర్యటనలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రి, ఇతర కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా సాయం కోరనున్నట్లు తెలిసింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయడం, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీరు తదితర అంశాలపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు సమాచారం. ఆయన గురువారం ఉదయం 10.15 గంటలకు ప్రధానమంత్రి మోదీని కలుస్తారు. అంతకు ముందు 9 గంటలకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్, 12.15 గంటలకు రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, 2గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, 2.45కు హోంమంత్రి అమిత్‌ షా, శుక్రవారం ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, 10 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, 10.45కి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, 12.30కి మంత్రి అఠవాలేలను కలుస్తారు. తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్‌ రాయభారితో సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరిగి వెళ్లి శనివారం విభజన సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగే సమావేశంలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని