Congress: భారాసకు భారీ షాక్‌

భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది.

Updated : 05 Jul 2024 06:36 IST

కారు దిగి హస్తాన్ని అందుకున్న ఆరుగురు ఎమ్మెల్సీలు
అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్‌ సమక్షంలో చేరిన భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్‌ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌ 

సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీల సమక్షంలో హస్తం పార్టీలో చేరిన భారాస ఎమ్మెల్సీలు దండె విఠల్, ఎంఎస్‌ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌. చిత్రంలో వేంనరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొన్నారు. భారాస ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్‌ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో సమావేశమైన వారు రాత్రి 11.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం దిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయింది. 

ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల చేరిక

ఇప్పటికే ఆరుగురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, కాలె యాదయ్య ఉన్నారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌ కూడా ఆ పార్టీ గూటికి చేరారు. తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే భారాస ఇబ్బంది పడుతోంది. తాజాగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు భారాసకు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని