USA: అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!

తెలంగాణకు చెందిన వెంకట్‌ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్‌ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు.

Updated : 24 Jun 2024 07:14 IST

ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు
ఐటీ రంగంలోనే సమస్య తీవ్రం
అక్కడ ఉండలేక... వెనక్కి రాలేక సతమతం 
మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి ఉంటుందంటున్న కన్సల్టెంట్లు
ఉండ్రు నరసింహారావు
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

  • తెలంగాణకు చెందిన వెంకట్‌ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్‌ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆయనకు హెచ్‌-1బీ వీసా కూడా వచ్చింది. పొదుపు చర్యల్లో భాగంగా ఏడాదిన్నర కిందట సంస్థ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. మరోచోట ఉద్యోగం లభించక.. వెంకట్‌ ఏడాదిగా న్యూజెర్సీలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నారు. 
  • హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థికి ఇంజినీరింగ్‌ పూర్తవగానే రూ.40 లక్షల ప్యాకేజీతో ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేసింది. అతను దాన్ని వద్దనుకుని అమెరికా వెళ్లి... ఇటీవలే ఎంఎస్‌ పూర్తి చేశారు. కొన్ని నెలలుగా ఉద్యోగం లభించక సతమతమవుతున్నారు. 
  • వరంగల్‌కు చెందిన అజయ్‌రెడ్డి ఇంజినీరింగ్‌ పూర్తిచేసి అయిదేళ్లు తెలంగాణలోనే ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేశారు. ఏడాదిన్నర కిందట అమెరికా వెళ్లి ఎంఎస్‌ చదివారు. అనుభవమున్నా ఆయనకు ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నాయి. 

అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్‌ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణం వారిని భయపెడుతుండగా... మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలామంది హోటళ్లలో, గ్యాస్‌స్టేషన్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. 

అక్కడే చదివి.. ఉద్యోగం పొందేందుకు... 

అమెరికాలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళుతుంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు రెండు లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45 వేల నుంచి 55 వేల మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు. అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలామంది ఎంఎస్‌లో కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కోర్సులను చదివేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్‌ చేసిన వారిలో దాదాపు 85% మందికి అక్కడే ఉద్యోగాలు లభించాయి.

నిరుద్యోగ సమస్య ఎందుకంటే.. 

కొవిడ్‌ ప్రభావం 2020 సంవత్సరంలో మొదలై ఏడాదిన్నరకు పైగా కొనసాగింది. రెండుసార్లు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులూ తక్కువ వడ్డీకే రూ.వేల కోట్ల రుణాలివ్వడంతో అనేక కంపెనీలు పెద్దఎత్తున ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదేస్థాయిలో తీసుకున్నాయి. కొవిడ్‌ ప్రభావం తగ్గిపోయాక.. అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపేసింది. పారిశ్రామికరంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు. లాక్‌డౌన్‌ సమయంలో వివిధ సంస్థలు, వ్యక్తులకిచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో అవి రుణాలివ్వడం ఆపేశాయి. అప్పటిదాకా 3-4 శాతం వరకున్న వడ్డీ రేటును గరిష్ఠంగా ఎనిమిది శాతానికి పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవని ఆ దేశస్థులు చెబుతున్నారు. దీని ప్రభావం పారిశ్రామికరంగంపై గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పనికంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండడంతో ఐటీ కంపెనీలు కొవిడ్‌ సమయంలో చేర్చుకున్న ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం మొదలుపెట్టాయి. అధిక జీతాలు పొందుతున్న ఉన్నతోద్యోగులను భారీగా తొలగించాయి. కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించేశాయి. గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్‌ నుంచి వెళ్లిన వారిపై తీవ్రంగా చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మందికి ఎంఎస్‌ పూర్తిచేసినా ఉద్యోగాలు లభించడం లేదు. 

అక్కడే ఉండటానికి అవస్థలు 

అమెరికాలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎంఎస్‌ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ.. విద్యార్థి పేరిట ఓపీటీ ఐ20 (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌)ని విడుదల చేస్తుంది. ఇది వచ్చిన నెల రోజుల్లో ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ)కి దరఖాస్తు చేయాలి. దీనికి ఆమోదం లభించిన మూడు నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. లేనిపక్షంలో ఆ దేశాన్ని విడిచి పెట్టాలి. అయితే, విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాంకుల నుంచి విద్యారుణం తీసుకుంటారు. స్వదేశానికి వచ్చాక.. ఇక్కడ ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. అందుకే ఏదోఒక రూపంలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎంఎస్‌ పూర్తికాకుండా ఉండటానికి ఒకట్రెండు సబ్జెక్టులను అలానే వదిలేస్తున్నారు. మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్‌ సహాయకులుగా చేరుతున్నారు. దీనికి ఎలాంటి జీతం ఉండదు. అయితే, ప్రొఫెసర్‌ ఇచ్చే పత్రంతో ఏడాదిపాటు అమెరికాలోనే ఉండొచ్చు. ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒకచోట పనిచేస్తున్నట్లు ధ్రువపత్రం తెచ్చుకుంటున్నారు. సమస్య ఇంతలా వేధిస్తున్నా.. ఏటా అక్కడికి వెళ్లేవారి సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం. 

ప్రభుత్వ తోడ్పాటు అందిస్తే మార్పునకు అవకాశం 

వచ్చే నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. బైడెన్, డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ పడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికరంగానికి తోడ్పాటు ఇస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్‌ ఇలాంటి తోడ్పాటు ఇచ్చారని, ఎన్నికల్లో ఆయన గెలిస్తే పారిశ్రామిక రంగానికి మరోసారి చేయూతనిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 


అనుభవమున్నా అందని ఉద్యోగం 

నేను 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నా. కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉద్యోగావకాశాలను చూపించా. ప్రస్తుత సంక్షోభం కారణంగా పదేళ్ల సర్వీసు ఉన్న వారికీ ఉద్యోగం దక్కని పరిస్థితి ఏర్పడింది. 14 ఏళ్ల అనుభవమున్న వారు కూడా ఉద్యోగాలు కోల్పోయి అల్లాడుతున్నారు. ఐటీ రంగంలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యను గత 28 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. 

అయితరాజు శ్రీకాంత్, కన్సల్టెన్సీ యజమాని


ఏడాదిన్నరలో మార్పు రావచ్చు 

అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పరిస్థితిని నెలరోజుల పాటు పరిశీలించి రెండు రోజుల కిందటే హైదరాబాద్‌ వచ్చా. అక్కడి ఆర్థిక సంక్షోభం ప్రభావం ఐటీ కంపెనీలపైనా పడింది. అవి మొదట్లో వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు తీసివేతలు చాలావరకు ఆగినా కొత్త ఉద్యోగులను అతి తక్కువ సంఖ్యలోనే తీసుకుంటున్నాయి. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. వేల మంది ఓపీటీపైనే ఉన్నారు. ఈ ఏడాది చివరికి.. లేదా వచ్చే ఏడాది మధ్య నాటికి పరిస్థితిలో మార్పు రావచ్చు.

ఆలపాటి శుభకర్, గ్లోబల్‌ ట్రీ కెరియర్స్‌ కన్సల్టెన్సీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని