ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ

అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్‌ వాషింగ్టన్‌ డీసీ తెలుగు కల్చరల్‌ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.

Published : 25 Jun 2024 20:00 IST

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్‌ వాషింగ్టన్‌ డీసీ తెలుగు కల్చరల్‌ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ ఏర్పాటు చేసి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం కృష్ణ లాం మాట్లాడుతూ..  ‘అమెరికాలో ఐదు దశాబ్దాల క్రితం తెలుగు భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకునేందుకు ఏర్పడిన తొలిసంస్థ జీడబ్ల్యూటీసీఎస్. తన భాష, సంస్కృతిని విస్మరించిన ఏ జాతి మనగడ సాగించలేదు. ఈ యాభై వసంతాల వేడుకల్లో కుల, మత, ప్రాంతాలకతీతంగా అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారు భాగస్వాములై విజయవంతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున స్పందన లభించిందని.. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఇప్పటికే సుమారు ఐదు కోట్ల విరాళాలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  

తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య, వైద్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపట్టారని ప్రశంసించారు. అనంతరం నరేన్ కొడాలి మాట్లాడుతూ.. ఆధునిక జీవనశైలిలో సంస్కృతి, సంప్రదాయాలు మారుతున్నప్పటికీ మనం మాత్రం జీడబ్ల్యూటీసీఎస్ ద్వారా  పండుగలను, సంప్రదాయాలను క్రమం తప్పకుండా పాటిస్తున్నామన్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, వైభవ ప్రాభావాలను భావితరాలకు అందించే బాధ్యత ఈ తరంపై ఉందని గంగాధర్ నాదెండ్ల  గుర్తుచేశారు. అన్ని భాషలు, సంస్కృతుల్లో తెలుగువారు ముందుంటారని కొనియాడారు. అనంతరం రవి పొట్లూరి మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న తెలుగువారిని ఒక గొడుగు కిందకు చేర్చి, తెలుగుజాతికి  గుర్తింపు, గౌరవాన్ని ఈ సంస్థ తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మన్నవ సుబ్బారావు, జక్కంపూడి సుబ్బారాయుడు, ముల్పూరి వెంకట్రావు, సాయిసుధ పాలడుగు, సత్యనారాయణ మన్నె, అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని తదితరులు ప్రసంగించారు.  

ఈ కార్యక్రమంలో సుశాంత్ మన్నె, భాను మాగులూరి, విజయ్ అట్లూరి, శ్రీనివాస్ గంగ, ఉమాకాంత్ రఘుపతి, యాష్ బొద్దులూరి, పద్మజ బేవర, చంద్ర మాలావతు, ప్రవీణ్ కొండక, రాజేష్ కాసరనేని, శ్రీవిద్య సోమ, సుష్మ అమృతలూరి, నాగ్ నెల్లూరి, అశోక్ దేవినేని, శ్రీనివాస్ పెందుర్తి, మురళి దొందిరెడ్డి, తేజ రాపర్ల, వేణు జంగ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని