ఏపీలో ఎన్డీయే కూటమి గెలుపు... వాషింగ్టన్‌ డీసీలో ప్రవాసాంధ్రుల సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులు బాధ్యతలు స్వీకరించడం పట్ల అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తెదేపా, జనసేన, భాజపాకు చెందిన ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

Updated : 18 Jun 2024 00:56 IST

500 కార్లతో భారీ ప్రదర్శన

వాషింగ్టన్ డీసీ:  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు... మంత్రులు బాధ్యతలు స్వీకరించడం పట్ల అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తెదేపా, జనసేన, భాజపాకు చెందిన ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మూడు పార్టీల జెండాలు చేతబూని... ఎన్డీఏకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 500 కార్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు సుజనా చౌదరి, రోషన్ కుమార్, సుందరపు విజయ్ కుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ఈ అఖండ విజయంలో భాగస్వాములైన ఎన్ఆర్‌ఐలకు అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులందరూ వ్యయప్రయాసలకు ఓర్చి జన్మభూమికి వచ్చి కూటమి విజయంలో పాలుపంచుకున్నారు’ అని అన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ ‘రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టడంలో ప్రవాసాంధ్రులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. రాష్ట్రాభివృద్ధిలోనూ ఎన్ఆర్‌ఐలు కీలకపాత్ర పోషించాలి’ అని కోరారు.  

ఎన్ఆర్‌ఐ తెదేపా యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ.. ‘ఓటర్లు చూపిన విజ్ఞత, చైతన్యం వల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యపడింది’ అని పేర్కొన్నారు. సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో ఆర్థిక నేరస్థులకు, హంతకులకు, అరాచక శక్తులకు చోటులేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి’ అని అన్నారు. సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ ‘కూటమిగా ఏర్పడటం, మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని పునర్ నిర్మించగలుగుతారనే విశ్వాసం గెలుపునకు పునాది. రాష్ట్రాభివృద్ధి కోసం భవిష్యత్ లోనూ ఎన్ఆర్‌ఐలు తమ సహాయసహకారాలను కొనసాగించాలి’ అని అన్నారు. 

తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. ‘జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి ఉన్మాదులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక. తెదేపా విజయంలో ఎన్ఆర్‌ఐల భాగస్వామ్యం మరువలేనిది’ అని కొనియాడారు. గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘కూటమి చారిత్రక విజయం సాధించింది. ప్రవాసాంధ్రుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎంతో గొప్పగా తమ ఆనందాన్ని పంచుకున్నారు’ అని హర్షం వ్యక్తం చేశారు. భాను మాగులూరి కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా, సుధీర్ కొమ్మి, విజయ్ గుడిసేవ, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, వేణు పులిగుజ్జు, అనిల్ ఉప్పలపాటి, త్రిలోక్ తదితరులు ప్రసంగించారు.

కార్యక్రమంలో నరేన్ కొడాలి, చంద్ర బేవర, శ్రీరామ్ తనికెళ్ల, ప్రవీణ్ దాసరి, చౌదరి యలమంచిలి, సతీష్ చింత, రాజేష్ కాసరనేని, రవి అడుసుమిల్లి, రమేష్ గుత్తా, సాయిసుధ పాలడుగు, మంజూష గోరంట్ల, శుభ ఎర్రంశెట్టి, రాధికా రామాయణం, సురేఖ చనుమోలు, సంజయ్ నాయుడు, కృష్ణ గుడిపాటి, యువ సిద్ధార్థ్ బోయపాటి, సమంత, మురళి, వినీల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని