Dashavatara Venkateswara swamy: కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు

అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 

Updated : 20 Jun 2024 01:00 IST

అమెరికా: సౌత్ కరోలినా రాష్ట్రంలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి కొలువుదీరారు. ఈనెల 14 నుంచి 16 తేదీల మధ్య స్థానిక వెంకటేశ్వర ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రెండు రోజుల్లో అంకురార్పణ, సంకల్పం, జలాధివాసం, భూమిపూజ, విష్ణు సహస్రనామ హోమం, శ్రీ దశావతార హోమం, పుష్పాధివాసం నిర్వహించారు. మూడో రోజు ఆరు అడుగుల స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. అదేరోజు స్వామి వారి కళ్యాణం, రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులకు కనులవిందుగా నిలిచింది. విద్వాన్ శ్రీ శ్రీధర శ్రీనివాస భట్టాచార్య, శ్రీ మధుగిరి రాఘవ శ్రీనివాస నారాయణ భట్టార్‌ల ఆధ్వర్యంలో పదకొండు మంది ఋత్వికుల సమక్షంలో శాస్త్రోక్తంగా, నిర్విఘ్నంగా చేపట్టారు. 

ఈ కార్యక్రమం కోసం సుమారు 70 మంది వలంటీర్లు నెలరోజుల పాటు నిర్విరామంగా కృషి చేశారు. ప్రతిరోజూ అనేక వందలమంది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన వి.మురళి నేతృత్వంలో ముగ్గురు విద్వాంసులతో కూడిన నాదస్వర బృందం కార్యక్రమం ఆసాంతం చక్కని సంగీతంతో అలరించారు. అట్లాంటా నుంచి వచ్చిన రామకృష్ణ దంపతులు సాంప్రదాయక, రుచికర భోజనాలు వండిపెట్టారు. చివరి రోజున ఋత్వికులను, వలంటీర్లను నిర్వాహకులు సత్కరించారు. బాలబాలికల కోసం నిర్వహించిన దశావతార క్విజ్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. 

ఈ సందర్భంగా, ధర్మకర్తల మండలి అధ్యక్షులు సత్య శ్రీనివాస దాస కడాలి మాట్లాడారు. మత్స్య, కూర్మ, వరాహ ,వామన, నరసింహ, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీ కృష్ణ, కల్కి, శ్రీ వెంకటేశ్వర రూప అంశలతో కూడిన శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి విగ్రహం అమెరికాలో మొదటిది, ప్రపంచంలోనే రెండవదని అన్నారు. ఈ విగ్రహం ఎంత వైవిధ్యమో, అంతే విధంగా దాదాపు రెండు వేలమందికి విగ్రహ ప్రతిష్ఠాపన ఆహ్వానం, స్వామి వారి అక్షింతలను వాలంటీర్ల సహాయంతో ఇళ్లకు వెళ్లి ఇచ్చి ఆహ్వానించామన్నారు. శ్రీ దశావతార వెంకటేశ్వర దేవస్థానం ఇక నుంచి ఒక పుణ్య తీర్థంగా రూపొంది, అమెరికా నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర ఆలయ ధర్మకర్తలు డాక్టర్.లక్ష్మణ్ రావు ఒద్దిరాజు, డా. అమర్నాథ్, ఆనంద్ పాడిరెడ్డి, శరత్ గొర్రెపాటి తదితరులు ఈ కార్యక్రమన్ని విజయవంతం చేసిన భక్తులకు, వలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం బాలాలయంగా ఉన్న ఈ దేవస్థానం, ప్రపంచమంతటా ఉన్న స్వామివారి భక్తుల సహాయ సహకారాలతో త్వరలో పూర్తి స్థాయి ఆలయంగా మారటానికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకోవాలని, సరికొత్త ప్రాంగణంలో శోభాయమానంగా రూపొందాలని స్థానిక భారతీయులు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని