Ramoji rao: కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్‌’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. జర్నలిజం రంగంలోనే కాకుండా సినీ రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన నిర్మించిన ఉషా కిరణ్‌ మూవీస్‌ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.

Updated : 08 Jun 2024 12:50 IST

పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన రామోజీ రావు.. సినీరంగంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కాదని మనసులు కదిలించే బొమ్మలంటూ ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థను స్థాపించారు. దానిపై వివిధ భాషల్లో 87 చిత్రాలను నిర్మించి ఎంతోమంది కొత్త నటీనటులను రంగుల పరిశ్రమకు పరిచయం చేశారు.

ఉషాకిరణ్‌ మూవీస్‌ ప్రస్థానమిది..

సమున్నత పాత్రికేయ విలువలకు పట్టంగట్టే ఈనాడుకు అనుబంధంగా ప్రారంభమైనదే ‘సితార’ సినిమా వారపత్రిక. రంగుల లోకంలోని విశేషాలను సమగ్రంగా అందించేలా దాన్ని ప్రారంభించారు. 1976లో ఇది పాఠకుల ముంగిటకు వచ్చింది. కేవలం వార్తలు, కథనాలను అందించేందుకు పరిమితం కాకుండా విలువలున్న చిత్రాల్ని ప్రోత్సహించే దిశగానూ రామోజీ ఆలోచన చేశారు. ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలనే సదుద్దేశంలో 1983లో రామోజీరావు ఉషాకిరణ్‌ మూవీస్‌ను ప్రారంభించారు.

తొలిప్రయత్నమే విజయం..

ఉషాకిరణ్‌ మూవీస్‌పై నిర్మించిన తొలి సినిమానే సూపర్‌ హిట్‌గా నిలిచింది. ‘ప్రేమలేఖ’ నవలను చిత్రంగా మలచాలని భావించారు. ఆ కథను తెరకెక్కించే బాధ్యతను జంధ్యాలకు అప్పగించారు. ఆ సినిమానే ‘శ్రీవారికి ప్రేమలేఖ’. ఈ చిత్రం 1984 మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పు పొందింది.

‘మయూరి’ మరో సంచలనం..

కథలనేవి కల్పనల్లోంచి కాదు.. జీవితాల్లోంచి పుడతాయని ఉషాకిరణ్ మూవీస్ నిరూపించింది. అందుకు ఉదాహరణే ఈ సంస్థ నుంచి వచ్చిన నాలుగో చిత్రం 'మయూరి'. ఒక హిందీ పత్రికలో వచ్చిన వార్తను సినిమాగా మలిచి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ప్రమాదంలో కాలును పోగొట్టుకొని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. ఆ పాత్రలో సుధా చంద్రన్నే నటించారు. స్ఫూర్తివంతమైన ఆ చిత్రం వచ్చి రెండున్నర దశాబ్దాలు దాటిపోయినా ఉషాకిరణ్ మూవీస్ అనగానే 'మయూరి' తప్పకుండా గుర్తుకొస్తుంది. సినిమా అంటే రెండున్నర గంటలపాటు ఊహాలోకంలో విహరింపజేయడం మాత్రమే కాదని నిరూపించిన చిత్రమిది. 

ఈ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమే..

మౌనపోరాటం - యథార్థ సంఘటనలను తెరకెక్కించడంలో ఉషాకిరణ్ మూవీస్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఒడిశాలో జరిగిన సంఘటన ఆధారంగా ‘మౌన పోరాటం' చిత్రాన్ని నిర్మించారు. మగాడి చేతిలో మోసపోయిన ఓ వనిత పోరాటాన్ని ప్రభావశీలంగా తెరపై ఆవిష్కరించారు. 1989లో విడుదలైన ఆ చిత్రం ఎందరినో ఆలోచింపచేసింది.

ప్రతిఘటన - ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ఏనాడూ కథానాయికనుగానీ, ఏ స్త్రీ పాత్రనుగానీ బలహీనంగా చూపించలేదు. ఆ పాత్రకు ఔచిత్యం, మనో ధైర్యం ఉండేలా తీర్చిదిద్దారు. ఇందుకు 'ప్రతిఘటన' తార్కాణం. సంఘ విద్రోహులతో పోరాడే తెగువ ఉన్న ఓ వనిత గాథను ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల మదిలో చెరిగిపోకుండా ఉంది. ఆ చిత్రంలోని 'ఈ దుర్యోధన...' పాటను ఎవరైనా మరువగలరా? ఆ పాటలోని సాహిత్యాన్ని ఆమోదించేందుకు ముందుగా నిర్మాతకు సంకల్ప బలం కావాలి. అది రామోజీరావుకు ఉంది కాబట్టే రచయిత వేటూరి రాయగలిగారు... దర్శకుడు టి. కృష్ణ అంతే శక్తిమంతంగా చిత్రించగలిగారు.

మరికొన్ని ఘనవిజయాలు..

క్రీడా కారిణి అశ్విని నాచప్పను కెమెరా ముందుకు తీసుకొచ్చింది కూడా ఈ సంస్థే. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తిదాయక చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే 'అశ్వని' కథ. ఆ పాత్రకు నిజ జీవితంలో క్రీడాకారిణి అయితే బాగుంటుందన్న ఆలోచనతోనే అశ్వని నాచప్పను ఎంచుకున్నారు. క్రీడలకే పరిమితమైన ఆమె.. కథ నచ్చడంతోపాటు, ఉషాకిరణ్ మూవీస్ విశిష్టతను తెలుసుకుని నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఇలా చెబుతూ వెళ్తే ప్రతి చిత్రం వెనక ఓ బలమైన నేపథ్యం, ఓ సంకల్పం ఉంటాయి. 'తేజ', 'మనసు మమత', 'అమ్మ', 'జడ్జిమెంట్', 'పీపుల్స్ ఎన్ కౌంటర్'... అన్నీ నాటి సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టినవే. 'చిత్రం', 'నువ్వే కావాలి', 'ఆనందం' వంటి ఘనవిజయాలున్నాయి.

'నచ్చావులే', 'బెట్టింగ్ బంగా ర్రాజు', 'నువ్విలా' లాంటి ప్రేక్షకులను ఉల్లాసపరిచే చిత్రాలు వచ్చాయి. 'నువ్వే కావాలి' సాధించిన వసూళ్లూ, సృష్టించిన రికార్డులూ ఆ ఏడాది ఏ మాస్ హీరోకీ తీసిపోనివే. చిన్న చిత్రాల రూపకర్తలకు ధైర్యాన్నిచ్చినవే. కొత్త ట్రెండ్ సృష్టించినవే. కేవలం తెలుగు చిత్రాలకే ఉషాకిరణ్ మూవీస్ పరిమితం కాలేదు. 'నాచే మయూరి', 'ప్రతిఘాత్', చిత్రాలతో బాలీవుడ్‌లోనూ జయకేతనం ఎగరేసింది. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ఇప్పటి వరకూ 87 చిత్రాలు నిర్మించిందీ సంస్థ.

పురస్కారాలు కోకొల్లలు..

తొలి చిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ' నుంచే ప్రేక్షకుల మెప్పుతో పాటు ప్రభుత్వ పురస్కారాలూ వరించాయి. 'కాంచనగంగ', 'మయూరి', 'ప్రతిఘటన', 'తేజ', 'మౌనపోరాటం' లాంటి చిత్రాలకు నంది అవార్డులు దక్కాయి. 'మయూరి'లో నటించిన సుధాచంద్రన్‌కు ఏకంగా జాతీయస్థాయిలో ప్రత్యేక పురస్కారం లభించింది. 'నువ్వే కావాలి' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయస్థాయి అవార్డు అందుకుంది.

కొత్త వారికే ప్రాధాన్యం..

ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటీనటులు ఎందరో ఉన్నారు. ప్రతిభ ఉంటే చాలు అవకాశమిచ్చి ప్రోత్సహించారు. శ్రీకాంత్, వినోద్‌కుమార్‌, చరణ్ రాజ్, యమున, వరుణ్ రాజ్, ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్, రీమాసేన్, శ్రియ, జెనీలియా, రితేశ్‌ దేశ్‌ముఖ్, రిచా పల్లోడ్, మాధవీలత... ఇలా ఎందరో నటులు ఈ సంస్థ ద్వారానే చిత్రసీమకు పరిచయమయ్యారు. గాయనిగా ఉన్న ఎస్. జానకి సంగీత దర్శకురాలైంది కూడా 'మౌనపోరాటం' చిత్రంతోనే. మల్లికార్జున్, ఉష, గోపికా పూర్ణిమ లాంటి గాయనీగాయకులను శ్రోతలకు చేరువ చేసింది కూడా ఈ సంస్థే.

సినిమా తీయడం ఒక ఎత్తు. దాన్ని ప్రేక్షకుల ముంగిటకు తీసుకువెళ్లడం మరో ఎత్తు. సినిమా వ్యాపారంలో ఆ దశే కీలకమైనది. ఆ రంగంలోనూ ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సంకల్పించారు రామోజీరావు. చిత్ర నిర్మాణంతోపాటే పంపిణీ విభాగానికీ శ్రీకారం చుట్టారు. అలా ఏర్పాటైందే ‘మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని