Adipurush: ‘ఆదిపురుష్‌’ టికెట్లు ఫ్రీ.. నిర్మాత అభిషేక్‌ కీలక ప్రకటన.. వారికి మాత్రమే

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్‌ సినిమా.. ‘ఆదిపురుష్‌’. 10 వేల మందికిపైగా ఈ సినిమా టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ప్రకటించారు.

Updated : 07 Jun 2023 20:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ (Abhishek Agarwal) కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా టికెట్లను 10 వేల మందికిపైగా ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి మాత్రమే టికెట్లు ఉచితంగా అందివ్వనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారిని ఈ https://bit.ly/CelebratingAdipurush…  గూగుల్‌ ఫామ్‌ని పూర్తి చేయాల్సిందిగా కోరారు. సంబంధిత వివరాలు నమోదు చేస్తే తాము టికెట్లు పంపిస్తామని తెలిపారు. సందేహాలకు 95050 34567 నంబరుకు ఫోన్‌ చేయొచ్చన్నారు. ‘‘ఈ జూన్‌లో అత్యంత గొప్ప వ్యక్తి మర్యాద పురుషోత్తముని స్మరించుకుందాం. ఆదిపురుష్ వేడుకలు చేసుకుందాం. శ్రీరాముడి ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈతరం ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన దివ్య అడుగుజాడలను అనుసరించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని భారీ బడ్జెట్‌తో 3డీలో దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో ప్రముఖ హీరో ప్రభాస్‌ (Prabhas).. రాముడిగా, హీరోయిన్‌ కృతిసనన్‌.. సీతగా నటించారు. లంకేశ్‌ (రావణాసురుడు)గా సైఫ్‌ అలీఖాన్‌, హనుమంతుడిగా సన్నీసింగ్‌ కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 16న (Adipurush Release on June 16th) ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు చిత్ర బృందం..  ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లలో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. ‘కార్తికేయ 2’, ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన అభిషేక్‌.. ‘ఆదిపురుష్‌’ సినిమాలో భాగమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని