Mohan Babu: టాలీవుడ్‌కు సీఎం రేవంత్‌ సూచన.. స్పందించిన మోహన్‌ బాబు

టాలీవుడ్‌కు సీఎం రేవంత్‌ ఇచ్చిన కీలక సూచనపై నటుడు మోహన్‌ స్పందించారు. ఏమన్నారంటే?

Published : 03 Jul 2024 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ సూచనలపై ప్రముఖ నటుడు మోహన్‌ బాబు (Mohan Babu) స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ పెట్టారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) డ్రగ్స్‌కు యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ.. సినిమా నటీనటులను 1 లేదా 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకుముందే ఇటువంటి వీడియోలు కొన్ని చేశా. అయినా సీఎం ఆదేశం మేరకు సందేశాత్మకమైన కొన్ని వీడియోలు రూపొందించి, ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నా’’ అని పేర్కొన్నారు. తన పోస్ట్‌కు రేవంత్‌, సీఎంఓ ఎక్స్‌ ఖాతాలను ట్యాగ్‌ చేశారు.

ఆ బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. సామాజిక సమస్యలైన సైబర్‌క్రైమ్‌, డ్రగ్స్‌ నియంత్రణలో సినిమా ఇండస్ట్రీ తన వంతు బాధ్యత వహించడం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. ఇక నుంచి ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్‌ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తూ ఓ వీడియో చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని