Tollywood: మెరుపులు మళ్లీ మళ్లీ

ఆలస్యం అమృతం విషమన్నట్లుగా కెరీర్‌ను జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెట్టిస్తుంటారు కథానాయికలు. హిట్టు మాట వినిపించారంటే చాలు అన్ని భాషల్ని చకచకా చుట్టేస్తూ.. వీలైనంత త్వరగా కెరీర్‌ను చక్కబెట్టుకునే పనిలో ఉంటారు.

Published : 29 Jun 2024 01:26 IST

వరస సినిమాలతో జోరు చూపించనున్న కథానాయికలు 

ఆలస్యం అమృతం విషమన్నట్లుగా కెరీర్‌ను జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెట్టిస్తుంటారు కథానాయికలు. హిట్టు మాట వినిపించారంటే చాలు అన్ని భాషల్ని చకచకా చుట్టేస్తూ.. వీలైనంత త్వరగా కెరీర్‌ను చక్కబెట్టుకునే పనిలో ఉంటారు. అందుకే ఈ అందాల భామల నుంచి సంక్రాంతికి ఒకటి.. ఉగాదికి ఇంకొకటి.. దసరాకు మరొకటి అంటూ వరుస సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడిలా ఈ ద్వితీయార్ధంలో వరుస చిత్రాలతో దూకుడు చూపించడానికి పలువురు స్టార్‌ నాయికలు సిద్ధమవుతున్నారు. 

భిమాన తారలు నెలల వ్యవధిలో వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేస్తుంటే సినీప్రియుల్లో కనిపించే జోష్‌ మరో స్థాయిలో ఉంటుంది. అయితే ఈ స్థాయిలో జోరు చూపించడంలో ముందుండేది ఎప్పుడూ కథానాయికలే. ఇప్పుడిలా నెలల వ్యవధిలో వరుస చిత్రాలతో థియేటర్లలో వినోదాల వెన్నెల కురిపించేందుకు పలువురు నాయికలు పోటీ పడుతున్నారు. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి గతేడాది వెండితెరపై అసలు కనిపించనే లేదు. అలాగని తనేమీ ఖాళీగానూ లేదు. ఓవైపు దక్షిణాదిలో ‘అమరన్‌’, ‘తండేల్‌’ చిత్రాలు చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్‌లో రెండు సినిమాలు పట్టాలెక్కించింది. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లు ఒకొక్కటిగా సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అమరన్‌’ నిర్మాణానంతర పనుల్లో ఉండగా.. ఆమె నాగచైతన్యతో చేస్తున్న ‘తండేల్‌’ ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. వీటిలో ‘అమరన్‌’ సెప్టెంబరులో సినీప్రియుల ముందుకు రానుండగా.. ‘తండేల్‌’ డిసెంబరులో విడుదల కానుంది. ప్రస్తుతం సాయిపల్లవి హిందీలో ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌తో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదే తెరపైకి రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇదే జరిగితే ఈ ఏడాది సాయిపల్లవి ముచ్చటగా మూడు సినిమాలతో మురిపించినట్లవుతుంది.

రయ్‌.. రయ్‌.. అనుపమ

చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది అనుపమ పరమేశ్వరన్‌. ఆమె ఈ ఏడాది ఇప్పటికే ‘ఈగల్‌’, ‘టిల్లు స్క్వేర్‌’, ‘సైరెన్‌’ చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ దూకుణ్ని ద్వితీయార్ధంలోనూ కొనసాగించనుంది. ప్రస్తుతం ఆమె లైకా ప్రొడక్షన్స్‌లో ఏఆర్‌ జీవా దర్శకత్వంలో ‘లాక్‌డౌన్‌’లో నటించిన సంగతి తెలిసిందే. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత అనుపమ నుంచి ‘పరదా’ అనే మరో సినిమా థియేటర్లలోకి రానుంది. ‘సినిమా బండి’తో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని మెప్పించిన ప్రవీణ్‌ కండ్రేగుల దీన్ని తెరకెక్కించారు. దర్శన రాజేంద్రన్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల్ని పలకరించనుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు.

రష్మిక.. ముచ్చటగా మూడు!

గతేడాది ‘యానిమల్‌’ చిత్రంతో జాతీయ స్థాయిలో సినీప్రియుల్ని మెప్పించింది రష్మిక. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2’, ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘కుబేర’, ‘ఛావా’, ‘సికందర్‌’ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. వీటిలో ఈ ఏడాది ఆమె నుంచి కనీసం మూడు చిత్రాలైనా బాక్సాఫీస్‌ ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. కథానాయకుడు అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక నటిస్తున్న ‘పుష్ప 2’ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. దీన్ని డిసెంబరు 6న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మరోవైపు ఆమె నటిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’, అలాగే హిందీలో విక్కీ కౌశల్‌తో చేస్తున్న ‘ఛావా’ ముగింపు దశ చిత్రీకరణలోనే ఉన్నాయి. ఈ రెండు కూడా ఈ ఏడాది ఆఖర్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. త్వరలో విడుదల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది.

కీర్తి ఇలా.. మీనాక్షి అలా..

ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో సినీప్రియుల్ని అలరించింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఆమె విజయ్‌తో ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’, దుల్కర్‌ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్‌’, వరుణ్తేజ్‌తో ‘మట్కా’ సినిమాలతో పాటు విష్వక్‌ సేన్‌తో ఓ చిత్రం చేస్తోంది. వీటిలో ఇప్పటికే విజయ్, దుల్కర్‌ సినిమాల విడుదలపై స్పష్టత వచ్చేసింది. ఈ రెండూ సెప్టెంబరులోనే సినీప్రియుల్ని పలకరించనున్నాయి. ఇక వీటితో పాటు ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ‘మట్కా’ కూడా ఈ ఏడాది ఆఖర్లోనే థియేటర్లలోకి రానున్నట్లు సమాచారమందుతోంది. ఓవైపు నాయికా ప్రాధాన్య సినిమాలతో జోరు చూపిస్తూనే.. మరోవైపు కమర్షియల్‌ చిత్రాల్లోనూ నాయికగా నటిస్తోంది కీర్తి సురేశ్‌. ఆమె ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌లో చేసిన వినోదభరిత చిత్రం ‘రఘుతాత’. సుమన్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమా ఆగస్టు 15న సినీప్రియుల ముందుకు రానుంది. ఇక ఈ ఏడాది ఆఖర్లో కీర్తి నుంచి రానున్న మరో చిత్రం ‘బేబీ జాన్‌’. ఇది ఆమెకు తొలి బాలీవుడ్‌ సినిమా. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను కాలీస్‌ తెరకెక్కించారు. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా డిసెంబరు 25న థియేటర్లలోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని