ది ఇండియా హౌస్‌ ప్రారంభం

కథానాయకుడు రామ్‌చరణ్‌ సమర్పణలో నిఖిల్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్‌’.

Updated : 02 Jul 2024 01:26 IST

థానాయకుడు రామ్‌చరణ్‌ సమర్పణలో నిఖిల్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్‌’. రామ్‌ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం హంపిలోని విరూపాక్ష దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మంగళవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది. ‘‘1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో నిండి ఉన్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి ప్రొడక్షన్‌ డిజైనర్‌: విశాల్‌ అబానీ, ఛాయాగ్రహణం: కామెరాన్‌ బ్రైసన్‌. ఈ కార్యక్రమంలో అభిషేక్‌ అగర్వాల్, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


హారర్‌ మిస్టరీకి శ్రీకారం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ - అనుపమ పరమేశ్వరన్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత నవీన్‌ యెర్నేని క్లాప్‌నివ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘‘భిన్న ప్రపంచాన్ని ఆవిష్కరించే ఓ హారర్‌ మిస్టరీ చిత్రమిది. ఉత్కంఠ రేకెత్తిస్తూ, ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచేలా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు కౌశిక్‌. సాయిశ్రీనివాస్, అనుపమ ఇదివరకెప్పుడూ చేయని పాత్రల్ని ఇందులో పోషిస్తున్నారు. ఈ నెల 11 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: చిన్మయ్‌ సలాస్కర్, ప్రొడక్షన్‌ డిజైన్‌: మనీషా ఎ.దత్, కళ: డి.శివ కామేశ్, కూర్పు: నిరంజన్‌ దేవరమానే.


శ్రీరామ్‌ హీరోగా... కోడి బుర్ర 

‘ఒకరికి ఒకరు’, ‘రోజాపూలు’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన శ్రీరామ్‌ కథానాయకుడిగా ‘కోడి బుర్ర’ తెరకెక్కుతోంది. శ్రుతి మేనన్, ఆరుషి కథానాయికలు. చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు.  కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్‌ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్‌గౌడ్‌ నిర్మిస్తున్నారు. మహావీర్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ క్లాప్‌నివ్వగా,  ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు భరత్‌ కమ్మ స్క్రిప్ట్‌ని అందజేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్న చిత్రమిది. శ్రీరామ్‌ ఇప్పటివరకూ చేసిన పాత్రలకు  భిన్నంగా, పోలీసు అధికారిగా కనిపిస్తార’’న్నారు. శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘పేరుతోనే అందరిలోనూ ఆలోచన రేకెత్తించాం. చిత్రం తప్పకుండా అలరిస్తుంది’’అన్నారు. ఈ నెల 22 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణని ప్రారంభిస్తామన్నారు నిర్మాతలు. మంచి కథని ఎంచుకుని మిత్రులు కలిసి చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


నవ్వులు పంచే బర్త్‌డే బాయ్‌ 

వికృష్ణ, సమీర్‌ మళ్లా, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో విస్కి తెరకెక్కించిన చిత్రం ‘ది బర్త్‌డే బాయ్‌’. బొమ్మ బొరుసా పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 19న రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు మెహర్‌ రమేశ్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ చూస్తుంటే కొత్తదనంతో కూడిన సినిమాలా అనిపిస్తోంది. వినోదానికి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఇది పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘ఇదొక భిన్నమైన కామెడీ డ్రామా సినిమా. ఎం.ఎస్‌ చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించాం. ఇందులోని ప్రతి పాత్ర అందర్నీ అలరిస్తుంది. సహజత్వం కోసం సింక్‌ సౌండ్‌ విధానంలో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు దర్శకుడు విస్కి.


హంతకుల వేటలో  కరీనా 

న కూతురిని కోల్పోయిన ఓ డిటెక్టివ్‌.. ఆ హత్యకు సంబంధించిన కేసును ఛేదించడానికి రంగంలోకి దిగింది. మరి ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి..? పదేళ్ల చిన్నారిని చంపిన నిందితులను ఆమె పట్టుకోగలిగిందా..? అనేది తెలియాలంటే ‘ది బకింగ్‌హమ్‌ మర్డర్స్‌’ చూడాల్సిందే. బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయిక కరీనా కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. హన్సల్‌ మెహతా తెరకెక్కించారు. గతేడాది లండన్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడీ చిత్రాన్ని సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుపుతూ..ఓ పోస్టర్‌ను పంచుకుంది చిత్రబృందం. ఇందులో జస్మిత్‌ భమ్రా అనే డిటెక్టివ్‌ పాత్రలో కనిపించనుంది కరీనా. ఏక్తా కపూర్, శోభా కపూర్‌తో కలిసి కరీనా ఈ సినిమాని నిర్మిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని