కశ్మీర్‌కు వెల్‌కమ్‌

మరికొద్దిరోజుల్లో ‘సర్ఫిరా’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన.. ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 30 Jun 2024 06:20 IST

మరికొద్దిరోజుల్లో ‘సర్ఫిరా’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన.. ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ‘వెల్‌కమ్‌’ ఫ్రాంచైజీలో రాబోతున్న మూడో భాగం. దిశా పటానీ, రవీనా టాండన్, సంజయ్‌ దత్‌ తదితర బాలీవుడ్‌ నటీనటులు ఈ ప్రాజెక్టులో కలిసి సందడి చేయనున్నారు. ఇటీవలే ముంబయిలో 200 గుర్రాలతో ఓ పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించారు. తాజాగా ఇప్పుడు మరో షెడ్యూల్‌ కోసం చిత్రబృందం కశ్మీర్‌కి పయనమైనట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు జరిగే ఈ చిత్రీకరణలో సుమారు 1200 మంది పాల్గొననున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. డిసెంబరు 20న విడుదల కానుందీ చిత్రం.


దెయ్యం చెరలో ఇందిర 

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హీరమండీ:ది డైమండ్‌ బజార్‌’ వెబ్సిరీస్‌లో మెరిసిన బాలీవుడ్‌ అందాల తార సోనాక్షి సిన్హా.. త్వరలో ‘కాకుడా’ అనే చిత్రంతో రావడానికి ముస్తాబవుతోంది. ఆమె, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య సర్పోత్‌దర్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇందులోని తన పాత్ర గురించి తెలుపుతూ.. ఓ పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది సోనాక్షి. ‘‘ఇందిరకు దెయ్యాల మీద నమ్మకం లేదు. కానీ..కాకుడాకు కోపం ఎక్కువ. మరి ఈమె.. కాకుడా చెర నుంచి బయటపడగలదా..?’’ అని వ్యాఖ్యల్ని జోడించింది. ప్రతి మంగళవారం రాత్రి 7.15నిమిషాలకు ప్రతి ఇంట్లో ఉన్న చిన్న తలుపులు తెరిచే ఉంచాలనే వింత శాపానికి గురైన ఓ పల్లెటూరి కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 12న విడుదల కానుంది.


కూర్మావతారం నేపథ్యంలో..

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో హర్షవర్ధన్‌ కడియాల తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కూర్మనాయకీ’. కె.విజితా రావు నిర్మాత. శివాజీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తన ఫస్ట్‌లుక్‌తో పాటు  వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రాల్లో శివాజీ కనిపించిన తీరును బట్టి ఇందులో ఆయన శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. ‘‘కూర్మావతారం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథతో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రమిది. గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో శివాజీ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఓ స్టార్‌ హీరో కూడా కనిపించనున్నారు. ఆయనెవరన్నది త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో సాయికుమార్, అతిరా రాజ్, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ చంద్ర సంగీతమందిస్తుండగా.. రామ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని