Raj Tarun: నటుడు రాజ్‌ తరుణ్‌పై యువతి ఫిర్యాదు

రాజ్‌ తరుణ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేశారు. 

Updated : 05 Jul 2024 16:04 IST

హైదరాబాద్‌: సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని, ఇటీవల మరో సినీనటితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్‌ కొనసాగిస్తున్నట్టు తేలిందన్నారు. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగ్‌ పోలీసులు స్వీకరించారు. రాజ్‌తరుణ్‌పై గురువారం సాయంత్రం తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపారు. తగిన ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్‌ కేసులో నిందితురాలిగా ఉన్నట్టు వెల్లడించారు.

మేం రిలేషన్‌లో ఉన్నాం.. కానీ : రాజ్‌ తరుణ్‌

ఈ పరిణామంపై రాజ్‌ తరుణ్‌ స్పందించారు. ఓ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్‌ సర్కిల్‌, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. నేను వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్‌ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేసింది. మరో అబ్బాయితో రిలేషన్‌ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా ఆమె కేసు పెట్టింది. అయినా అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్‌ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని