Bunny Vasu: ...అలా చేస్తే నష్టమే

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి అత్యద్భుత సాంకేతిక విలువలున్న చిత్రాల్ని దక్షిణాది నుంచి ప్రపంచానికి అందిస్తున్నాం. ఇలాంటి ప్రయోగాలు చేయాలన్నా.. ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలన్నా టికెట్‌ ధరలు ఎక్కువ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అయితే ఇవే ధరల్ని చిన్న, మీడియం బడ్జెట్‌ చిత్రాలకు ఆపాదిస్తే నష్టపోవాల్సి వస్తుంది.

Updated : 11 Jun 2022 09:47 IST

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి అత్యద్భుత సాంకేతిక విలువలున్న చిత్రాల్ని దక్షిణాది నుంచి ప్రపంచానికి అందిస్తున్నాం. ఇలాంటి ప్రయోగాలు చేయాలన్నా.. ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలన్నా టికెట్‌ ధరలు ఎక్కువ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అయితే ఇవే ధరల్ని చిన్న, మీడియం బడ్జెట్‌ చిత్రాలకు ఆపాదిస్తే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్మాతలే తమ చిత్రాల్ని జాగ్రత్తగా వర్గీకరించుకొని.. ధరల విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ ఆదాయం వస్తుందని ఇష్టారీతిన ధరలు ఖరారు చేసుకుంటూ వెళ్తే.. భవిష్యత్తులో థియేటర్‌ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది’’ అన్నారు నిర్మాత బన్నీ వాస్‌. జీఏ2 సినిమా పతాకంపై వైవిధ్యభరితమైన చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్‌’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. గోపీచంద్‌, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రమిది. మారుతి తెరకెక్కించారు. జులై 1న విడుదల కానుంది. శనివారం బన్నీ వాస్‌ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

ఈ పుట్టిన రోజుకు కొత్తగా ఎంచుకున్న లక్ష్యాలేంటి?

‘‘కొవిడ్‌ వల్ల నష్టపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మూడేళ్లుగా సెట్స్‌పై ఉన్న పెద్ద చిత్రాలన్నీ వరుసగా బాక్సాఫీస్‌ ముందుకొచ్చేశాయి. మీడియం బడ్జెట్‌ చిత్రాలు విడుదల చేసుకోవడానికి ఇప్పుడు కాస్త గ్యాప్‌ దొరికింది. అందుకే మా బ్యానర్‌ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాం. జులై 1న వచ్చే ‘పక్కా కమర్షియల్‌’తో మొదలుపెట్టి.. అక్టోబర్‌ నెలాఖరు నాటికి అన్ని చిత్రాలు విడుదల చేసేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ‘18 పేజెస్‌’ను సెప్టెంబర్‌ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నిఖిల్‌ - అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రమిది. కిరణ్‌ అబ్బవరంతో చేస్తున్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాన్ని సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనుకుంటున్నాం. అల్లు శిరీష్‌తో చేస్తున్న సినిమాని ఆగస్ట్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’.

ఇంతకీ ‘పక్కా కమర్షియల్‌’ ఎలా ఉంటుంది?

‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే ఇది పక్కా ఎంటర్‌టైనర్‌. మామూలుగా గోపీచంద్‌ సినిమాలు కాస్త యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. దీంట్లో యాక్షన్‌తో పాటు మారుతి శైలి వినోదాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో గోపీచంద్‌, రాశి ఖన్నా పాత్రలు, వాళ్ల కామెడీ టైమింగ్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. బరువైన భావోద్వేగాలు, భారీ డ్రామాలు ఎక్కడా కనిపించవు.’’

ప్రస్తుతం ప్రతి సినిమా చాలా త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మీ బ్యానర్‌ నుంచి వచ్చే చిత్రాల విషయంలో ఏమైనా పరిమితులు పెట్టుకున్నారా?

‘‘మా జీఏ2 సంస్థ నుంచి వచ్చిన ఏ చిత్రాన్నీ 35రోజుల్లోపు ఓటీటీలో విడుదల చేసింది లేదు. రాబోయే రోజుల్లో ఈ గ్యాప్‌ను మరింత పెంచాలని చూస్తున్నాం. ఈ అంశంపై మిగిలిన చిత్ర నిర్మాతల్లోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మా సంస్థలో నిర్మితమవుతున్నవి ఎక్కువ ఎంటర్‌టైనర్లే. వాటిని ఇంట్లో కూర్చొని చూస్తే నవ్వు రాదు. అందుకే వీలైనంత ఎక్కువ గ్యాప్‌ తర్వాత ఓటీటీలోకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం హిందీలో థియేట్రికల్‌ రిలీజ్‌కు ఓటీటీ విడుదలకు మధ్య కనీసం 8వారాల గ్యాప్‌ ఉండాలని నిబంధన పెట్టుకున్నారు. ఇది జులై నుంచి అమల్లోకి రానున్నట్లుంది. అలాగే దక్షిణాదిలోనూ దీనిపై ఎగ్జిబిటర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇక్కడా ఓటీటీ విడుదలలకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు రావొచ్చని అర్థమవుతోంది’’.

‘పుష్ప2’ ఎప్పుడు మొదలవుతుంది? దీని తర్వాత అల్లు అర్జున్‌ చేయనున్న చిత్రమేది? సంజయ్‌ లీలా భన్సాలీతో సినిమా ఉంటుందా?

‘‘పుష్ప2’ స్క్రిప్ట్‌ సిద్ధమైంది. జులై నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలు కానుంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమా తర్వాత ఎలాంటి చిత్రం చేయాలన్న దానిపై అల్లు అర్జున్‌ ఆలోచిస్తున్నారు. దసరాకు కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఆ మధ్య అల్లు అర్జున్‌, సంజయ్‌ లీలా భన్సాలీ మధ్య జరిగింది సాధారణ మీటింగే. భన్సాలీకి ‘పుష్ప’ బాగా నచ్చింది. బన్నీకి ‘గంగూభాయి’ నచ్చింది. ఇద్దరూ కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఆ సమయంలో సందర్భం కుదరడంతో కలిసి మాట్లాడుకున్నారు. ప్రస్తుతానికైతే బన్నీ తర్వాతి డేట్స్‌ గీతా ఆర్ట్స్‌లోనే ఉన్నాయి’’.

మీ బ్యానర్‌లో రూపొందుతోన్న కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాం. శ్రీకాకుళంలో జరిగిన ఓ యథార్థ కథ ఆధారంగా ఆ చిత్రం రూపొందనుంది. అలాగే పవన్‌ సాధినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాం. ఇదీ వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కనుంది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’.

టికెట్‌ ధరల పెంపు విషయంలో అల్లు అరవింద్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ అభిప్రాయమేంటి?

‘‘ఆయా చిత్రాలకయ్యే బడ్జెట్లు, దానికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్‌కు తగ్గట్లుగా టికెట్‌ ధరల్ని రూ.150 నుంచి రూ.300 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇండస్ట్రీ బాగుండాలన్న ఉద్దేశంతో నిర్మాతలకు ఈ వెసులుబాటు కల్పించారు. అయితే బడ్జెట్లు, క్రేజ్‌ను పక్కకు పెడితే.. ఓ సినిమాకి ఎంత టికెట్‌ పెట్టొచ్చనే విషయంలో ప్రేక్షకుడికి ఓ అభిప్రాయం ఉంటుంది. అది తనకు సానుకూలంగా ఉందంటే ఫ్యామిలీతో కలిసి థియేటరకు వస్తాడు. లేదంటే ఓటీటీలో చూడొచ్చులే అని లైట్‌ తీసుకుంటాడు. ఇష్టారీతిన ఎక్కువ ధరలు పెట్టేస్తే.. ప్రేక్షకుడు ఓటీటీ వైపు మొగ్గు చూపే అవకాశముంటోంది. అందుకే ఏ చిత్రానికి ఎంత టికెట్‌ రేటు పెట్టాలనే విషయంలో నిర్మాతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే పెద్ద నష్టం తప్పదు. మనమెంత సంపాదించామన్న దాని కన్నా.. ప్రేక్షకుడ్ని థియేటర్‌కు ఎంత దగ్గరగా ఉంచామన్నది ఆలోచించాలి.’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు